78th Independence Day Gallantry Award: స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా దేశం కోసం తమ ప్రాణాలను అర్పించిన సైనికులకు కీర్తిచక్ర పురస్కారం ప్రకటించింది భారత ప్రభుత్వం. ఈ క్రమంలో జమ్మూ కశ్మీర్లోని అనంతనాగ్లో గత సంవత్సరం సెప్టెంబర్లో ఉగ్రవాదులతో పోరాడుతూ అమరుడైన కల్నల్ మన్ప్రీత్ సింగ్కు ప్రతిష్ఠాత్మక కీర్తిచక్ర పురస్కారం దక్కింది. సీనియర్ 19-రాష్ట్రీయ రైఫిల్స్ సెకండ్-ఇన్-కమాండ్గా పనిచేస్తున్న సమయంలో సేనా మెడల్ పొందారు కల్నల్ మన్ప్రీత్. అనంతనాగ్లోని దట్టమైన అటవీ ప్రాంతంలో ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్ జరిగింది. ఈ ఆపరేషన్లో వీరోచితంగా పోరాడుతూండగా వీరమరణం పొందారు.
జమ్మూ కశ్మీర్లో జరిగిన ఈ ఆపరేషన్లో కల్నల్ మన్ప్రీత్ సింగ్తోపాటు మరో ముగ్గురు భద్రతా సిబ్బంది వీర మరణం పొందారు. వీరిలో రైఫిల్మ్యాన్ రవికుమార్, మేజర్ మళ్ల రామగోపాల్ నాయుడు, జమ్మూకశ్మీర్ పోలీసు విభాగానికి చెందిన డిప్యూటీ సూపరింటెండెంట్ హుమాయూన్ ముజమ్మిల్ భట్లనూ కీర్తిచక్ర వరించింది.
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మొత్తం 103 గ్యాలంట్రీ అవార్డులను సాయుధ బలగాలు, కేంద్ర సాయుధ పోలీసు దళాల సిబ్బంది కోసం ఆమోద ముద్ర వేశారు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము. ఇందులో భాగంగా 18 మందికి శౌర్యచక్ర అవార్డులు దక్కాయి. 63 సేనా పతకాలు, ఒక బార్ టు సేనా పతకం, 11 నావో సేనా మెడల్స్, ఆరు వాయు సేనా పతకాలు కూడా గ్యాలంట్రీ అవార్డుల జాభితాలో ఉన్నాయి. అయితే శాంతి సమయంలో ఇచ్చే రెండో అత్యున్నత గ్యాలంట్రీ అవార్డు మాత్రం కీర్తిచక్ర మాత్రమే కావడం గమనార్హం.
Also Read: కోల్కతా వైద్యురాలి కేసు.. మిడ్నైట్ అట్టుడుకిన కోల్కతా, ఆసుపత్రిలో విధ్వంసం
కల్నల్ మన్ప్రీత్ సింగ్తో పాటు ఆపరేషన్లో పాల్గొన్నవారిలో కల్నల్ పవన్సింగ్, మేజర్ సీవీఎస్ నిఖిల్, మేజర్ ఆశిష్ ధోన్చక్, మేజర్ త్రిపట్ప్రీత్సింగ్, సిపాయి ప్రదీప్సింగ్ తదితరులు ఉన్నారు. వీరికి శౌర్యచక్ర పురస్కారం దక్కింది. మేజర్ ధోన్చక్, సిపాయి ప్రదీప్సింగ్ కూడా అనంతనాగ్లో గత సెప్టెంబర్లో జరిగిన ఎదురుకాల్పుల్లోనే కల్నల్ మన్ప్రీత్ సింగ్తో పాటు వీరమరణం పొందారు.