PM Modi Independence Day Record| ఆగస్టు 15 భారత దేశం స్వాతంత్య్రం సాధించిన రోజు. దేశ స్వాతంత్య్రానికి ప్రతీకగా ప్రతీ సంవత్సరం ఆగస్టు 15న దేశ ప్రధాన మంత్రి జాతీయ జెండాను ఢిల్లీ లోని ఎర్రకోటపై ఎగురవేస్తారు. ఈ సంవత్సరం కూడా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురు వారం ఆగస్టు 15, 2024న ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురవేశారు. ఆ తరువాత దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగం చేశారు. దీంతో ఆయన మాజీ ప్రధాన మంత్రులు జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ పేరున ఉన్న రికార్డును సమం చేశారు. ఆగస్టు 15న స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా వరుసగా 11 సార్లు దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగం చేసిన ప్రధాన మంత్రులుగా ఇప్పటివరకు నెహ్రూ, ఇందిరా గాంధీ పేరిట ఉన్న రికార్డుని ప్రస్తుత ప్రధాన మంత్రి మోదీ సమం చేశారు.
అయితే మోదీ మూడవ సారి ప్రధానిగా ఎన్నికైన తరువాత చేసే తొలి స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం ఇదే. అయితే ఆయన మరో రికార్డును కూడా అధిగమించారు. మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ వరుసగా పది సార్లు ఆగస్టు 15న జెండా ఎగురవేశారు. నరేంద్ర మోదీ ఈ విషయంలో ఆయనను అధిగమించారు. ఇప్పటివరకు అత్యధికంగా ఆగస్టు 15న జవహర్ లాల్ నెహ్రూ 17 సార్లు, ఇందిరా గాంధీ 16 సార్లు జాతీయ జెండాను స్వతంత్ర్యం రోజున ఎగురవేశారు. 1947 నుంచి 1964 వరకు దేశ తొలి ప్రధాని నెహ్రూ అత్యధికంగా 17 సార్లు జాతీయ జెండాను ఎగురవేసిన రికార్డు ఉంది. నెహ్రూ కుమార్తె, దేశ తొలి మహిళా ప్రధాని అయిన ఇందిరా గాంధీ కూడా 16 సార్లు ఎగుర వేసి నెహ్రూ తరువాత రెండో స్థానంలో ఉన్నారు. అయితే ఆమె రెండు పర్యాయాలు దేశ ప్రధాన మంత్రిగా 1966-77 వరకు, 1980-84 వరకు ఈ రికార్డును సాధించారు.
భారత దేశ ప్రధాన మంత్రులలో గుల్జారి లాల్ నందా, చంద్రశేఖర్.. వీరిద్దరికీ జాతీయ జెండాను ఎగుర వేసే అవకాశం ఒక్కసారి కూడా లభించలేదు. దేశంలో తొలిసారి 1990-91లో ఏర్పడిన కూటమి ప్రభుత్వంలో చంద్రశేఖర్ ప్రధాన మంత్రి అయ్యారు. గుల్జారి లాల్ నందా కూడా రెండుసార్లు 1964, 1966 మధ్య ప్రధాన మంత్రి పదవిని అతి తక్కువ కాలం చేపట్టారు. వారిద్దరి తరువాత అటల్ బిహారి వాజ్ పేయి 1996లో కేవలం 13 రోజుల అతి తక్కువ కాలానికి ప్రధాన మంత్రి అయ్యారు. ఆ తరువాత తిరిగి 1998 నుంచి 2004 వరకు ఆరేళ్లు ప్రధాని ఉన్న సమయంలో జాతీయ త్రవర్ణ పతాకాన్ని స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎగురువేశారు.
వాజ్ పేయి తరవాత దేశ అతిపిన్న వయస్కుడైన ప్రధాని రాజీవ్ గాంధీ 1984-89 మధ్య కాలంలో అయిదు సార్లు ఆగస్టు 15న జాతీయ జెండా ఎగురవేశారు. ఆయన తరువాత పివి నరసింహారావు 1991-96 మధ్య కాలంలో ప్రధానిగా పనిచేశారు. ఆయన కూడా అయిదు సార్లు జెండాను ఎగురవేశారు. లాల్ బహదూర్ శాస్త్రి, మోరార్జీ దేశాయ్ ఇద్దరూ రెండుసార్లు ప్రధాన మంత్రిగా జెండా ఎగుర వేశారు. శాస్త్రి 1964-1966 మధ్య ప్రధానిగా ఉన్నారు. ఇండియా పాకిస్తాన్ 1965 యుద్ధంలో భారత్ విజయంలో ఆయన కీలక పాత్ర పోషించారు. మరోవైపు దేశాయ్ 1977-79 మధ్య రెండు సంవత్సరాలు ప్రధానిగా ఉన్నారు.
నలుగురు ప్రధాన మంత్రులు చరణ్ సింగ్, విపి సింగ్, హెచ్ డి దేవె గౌడా, ఐకె గుజ్రాల్ వీరంతా తమ పదవి కాలంలో ఒకసారి జెండాను ఎగురవేశారు. చరణ్ సింగ్ 1979 నుంచి 1980 వరకు 170 రోజులు మాత్రమే పదవిలో ఉన్నారు. దేవెగౌడ ప్రధానిగా ఒక సంవత్సర కాలం కంటే తక్కువ రోజులే ప్రధానిగా కొనసాగారు. గుజ్రాల్ కూడా 1997-98లో తక్కువ కాలమే ప్రధాని పదవిలో ఉన్నారు.
Also Read: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మీ ప్రియమైన వారికి ఈ సందేశాలు పంపండి