Arogya Sri Health services closed: ఆంధ్రప్రవేశ్ రాష్ట్ర ప్రజలకు చేదు వార్త. రాష్ట్రంలో నేటినుంచి ఆరోగ్యశ్రీ వైద్య సేవలు నిలిచిపోయాయి. ఈ మేరకు గురువారం నుంచి ఎన్టీఆర్ వైద్య సేవ నెట్వర్క్ ఆస్పత్రుల్లో సమ్మె కొనసాగనుంది. ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం అందించిన ఆస్పత్రులకు బిల్లుల చెల్లింపులో ప్రభుత్వం జాప్యం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే నెట్ వర్క్ ఆస్పత్రుల్లో వైద్యం చేసేందుకు ఇబ్బందులు వస్తుండడంతో చికిత్స అందించేందుకు వెనుకడుగు వేస్తున్నాయని ఆరోపిస్తున్నారు.
పెండింగ్ ఆరోగ్య శ్రీ నిధులు విడుదల చేయాలని రాష్ట్రంలో ఉన్న ప్రైవేట్ ఆస్పత్రుల అసోసియేషన్ ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసినప్పటికీ స్పందించలేదని ఆరోపిస్తున్నారు. దీంతో ఆగస్టు 15 నుంచి సమ్మె నిర్వహిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఆరోగ్య శ్రీ సేవలను ప్రైవేట్ ఆస్పత్రులు నేటినుంచి నిలిపివేశాయి.
కాగా, గత కొంతకాలంగా రూ.2,500 కోట్ల బకాయిలు విడుదల చేయాలని వైద్యులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ విషయంపై ఎన్టీఆర్ వైద్య ట్రస్ట్ సీఈఓ లక్ష్మీ షా స్పందించారు. రూ.2,500 కోట్ల బకాయిలకు గానూ రూ.200 కోట్లు మాత్రమే విడుదల చేశారు. దీంతో ఆస్పత్రుల యాజమాన్యాలు నిరాశకు గురయ్యాయి.
Also Read: విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా బొత్స ఏకగ్రీవం!
తర్వాత మళ్లీ రూ.300 కోట్లు విడుదల చేస్తామని ప్రభుత్వ అధికారులు హామీ ఇచ్చారు. ఆరోగ్య శ్రీ సేవలకు అంతరాయం కలగకూడదని చెప్పారు. అయినప్పటికీ ప్రైవేట్ ఆస్పత్రులు వెనక్కు తగ్గలేదు. గతంలో ఇచ్చిన సమ్మె నోటీసుకు అనుగుణంగా నేటి నుంచి ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేస్తామని స్పష్టం చేశాయి.