CM Revanth Reddy: పంద్రాగస్టులోపు రుణమాఫీ కచ్చితంగా చేసి తీరుతాం. పార్లమెంట్ ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన ఇది. అంతా డ్రామా, ఎన్నికల స్టంట్ అంటూ విపక్షాలు విమర్శలు చేసిన ఆ సమయంలో, గబ్బర్ సింగ్ మాదిరి ‘సాంబ రాసుకోరా’ అంటూ పంద్రాగస్టుకు రుణమాఫీ చేస్తామని బలంగా చెప్పారు. ఆనాడు ఇచ్చిన మాటకు కట్టుబడిన సీఎం, ఈమధ్యే రుణమాఫీ మార్గదర్శకాలను విడుదల చేసి, ముందుగా లక్ష రూపాయల లోపు ఉన్న రుణాలను మాఫీ చేశారు. తర్వాత, లక్షన్నర లోపున్న రుణాల నుంచి రైతుల్ని విముక్తి చేశారు. ఇప్పుడు పంద్రాగస్టు వేడుకల వేళ 2 లక్షల రూపాయల రుణమాఫీకి సిద్ధమయ్యారు.
నెల రోజుల్లోనే పూర్తి
కాంగ్రెస్ అధికారం చేపట్టే నాటికి తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలుసు. ఏ శాఖ చూసినా అప్పులే. వీటిపై శ్వేతపత్రం విడుదల చేసి ప్రజలకు అన్నీ వివరించింది ప్రభుత్వం. ఓవైపు ఆర్థిక కష్టాలు ఉన్నా కానీ, అప్పులతో సతమతం అవుతున్న రైతుల్ని ఆదుకోవాలన్న లక్ష్యంతో, ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీకి నిర్ణయించారు సీఎం రేవంత్ రెడ్డి. కేవలం నెల రోజుల్లోనే రుణమాఫీ చేసి, సరికొత్త రికార్డును క్రియేట్ చేశారు. దాదాపు 32 లక్షల మందికి పైగా రైతులను రుణ విముక్తులను చేసేందుకు రూ.31 వేల కోట్లకు పైగా నిధులు కేటాయించి దేశం మొత్తం తెలంగాణ వైపు చూసేలా చేశారు.
రుణమాఫీ జరిగింది ఇలా!
జులై 15వ తేదీన రుణమాఫీ జీవో జారీ చేసింది ప్రభుత్వం. మూడు రోజుల వ్యవధిలోనే రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయటం మొదలు పెట్టింది. జులై 18వ తేదీన మొదటి విడుతగా లక్ష రూపాయల స్లాబ్ వరకు రుణమున్న రైతు కుటుంబాలన్నింటికీ ఏకకాలంలో మాఫీ చేసింది. 11,14,412 మంది రైతులకు రూ.6,034.97 కోట్లు విడుదల చేసింది. జులై 30వ తేదీన అసెంబ్లీ వేదికగా రెండో విడుత రుణమాఫీ కార్యక్రమం అమలు చేసింది ప్రభుత్వం. రూ.లక్ష నుంచి రూ.1.50 లక్షల వరకు రుణమున్న రైతు కుటుంబాలను రుణ విముక్తులను చేసింది. దాదాపు 6,40,823 మంది రైతుల ఖాతాల్లో రూ.6,190.01 కోట్లు జమ చేసింది.
Also Read: Telangana MLC: గవర్నర్ కోటా ఎమ్మెల్సీల కేసులో సుప్రీం స్టే
మూడో విడుతతో రుణమాఫీ ప్రక్రియ పూర్తి
కేవలం 12 రోజుల్లోనే దాదాపు 17.55 లక్షల రైతుల కుటుంబాలకు రూ.12 వేల కోట్లకుపైగా రుణమాఫీ నిధులు జమ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ క్రమంలోనే ఇవాళ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మూడో విడుత పంట రుణమాఫీకి సన్నద్ధమైంది. విదేశీ పర్యటన ముగించుకుని రాష్ట్రానికి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతులమీదుగా ఇది జరగనుంది. ఖమ్మం జిల్లా వైరా మండలంలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు. చివరి విడుతలో రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు ఉన్న పంట రుణాలు మాఫీ చేస్తారు. 14.45 లక్షల మందికి పైగా రైతులకు రూ.18.7 వేల కోట్లకు పైగా నిధులు జమ చేస్తారు. దీంతో రుణమాఫీలో కీలక ఘట్టం ముగుస్తుంది.