Telangana: గోదావరి నది ఒడ్డున భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని దుమ్ముగూడెం వద్ద సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లోని రైతుల ఆయకట్టుకు సాగునీటితో పాటు ప్రజలకు తాగునీరు, పారిశ్రామిక నీటి అవసరాలకు ఈ ప్రాజెక్టు ద్వారా నీటిని అందించాలనేది లక్ష్యం. నాగార్జున సాగర్ ఆయకట్టుతో పాటు వైరా, లంకా సాగర్, పాలేరు ప్రాజెక్టుల కింద ఆయకట్టు స్థిరీకరణకు ఈ నీటిని అనుసంధించాలనేది సంకల్పం. 3.28 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుతో పాటు 3.45 లక్షల ఎకరాల పాత ఆయకట్టు స్థిరీకరణ కలిపి మొత్తం 6.73 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందించాలనేది ప్లాన్.
బీఆర్ఎస్ పాలనలో నిర్లక్ష్యం
గత ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు రూ.18,286 కోట్ల అంచనాతో పరిపాలనా అనుమతులు జారీ చేసింది. 2016 నుంచి 2023 నవంబర్ వరకు ప్రాజెక్టుపై రూ.7,436 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టింది. అందులో రూ.5,472 బ్యాంకుల నుంచి తెచ్చిన అప్పులున్నాయి. రూ.1,964 కోట్లు ప్రభుత్వ వాటా. రూ.7,400 కోట్లు ఖర్చు పెట్టి ఎక్కడికక్కడ పనులు వదిలేసింది కేసీఆర్ సర్కార్. రైతులకు ఒక్క ఎకరం కూడా నీళ్లు ఇవ్వలేదు. సీతారామ ప్రాజెక్టును నిరుపయోగంగా వదిలేసిందనే ఆరోపణలను ఎదుర్కొంది. బీఆర్ఎస్ హయాంలో కనీసం 40 శాతం పనులు కూడా పూర్తి కాలేదనేది కాంగ్రెస్ వాదన.
కాంగ్రెస్ ప్రభుత్వంలో శరవేగంగా పనులు
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ఈ ప్రాజెక్టుకు మోక్షం కలిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో మిగిలిన పనులన్నీ యుద్ధ ప్రాతిపదికన పూర్తయ్యాయి. జూన్ 26వ తేదీన డ్రై రన్, 27వ తేదీన వెట్ రన్ ట్రయల్స్ విజయవంతంగా నిర్వహించారు. సీతారామ ప్రాజెక్టుపై పెట్టిన ఖర్చు వృధా కాకుండా ఉండేందుకు అవసరమైన చర్చలు జరిపింది ప్రభుత్వం. ముఖ్యమంత్రి భద్రాచలం పర్యటనకు వెళ్లినప్పుడు ఇంజినీరింగ్ అధికారులతో చర్చించారు. వెంటనే రాజీవ్ గాంధీ లింకు కెనాల్ ప్రతిపాదించింది ప్రభుత్వం. ఈ లిఫ్ట్ ద్వారా వచ్చే నీటిని 8.6 కిలోమీటర్ల లింక్ కెనాల్ (రాజీవ్ కాలువ) ఏర్పాటు చేసి సీతారామ నీటిని నాగార్జునసాగర్ కెనాల్కు అనుసంధానం చేయటం రాష్ట్ర ప్రభుత్వ విజయం.
Also Read: Independence Day: పంద్రాగస్టుకు సర్వం సిద్ధం.. ‘వికసిత్ భారత్ @ 2047’ అనే థీమ్తో వేడుకలు
చేయాల్సిందంతా చేసి ఇప్పుడు డ్రామాలు
కేవలం రూ.75 కోట్లు ఖర్చు పెట్టి రాజీవ్ లింకు కెనాల్ను మూడు నెలల్లో పూర్తి చేయటం తమ ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతకు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. పవర్ సప్లై, పంపింగ్ స్టేషన్లకు, గత ప్రభుత్వం వదిలేసిన పనులకు తొమ్మిది నెలల్లోనే రూ.482 కోట్లు విడుదల చేసినట్టు వివరిస్తున్నాయి. ఇవాళ వైరాలో ఈ రాజీవ్ లింక్ కెనాల్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. దీంతో దాదాపు లక్ష 50 వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. సాగర్ ఎడమ కాలువ పరిధిలోని ఆయకట్టు రైతుల సాగునీటి కొరత తీరటంతో పాటు కొత్త ఆయకట్టుకు నీరు అందుతుంది. అప్పుడు పంపు హౌజ్లు, సగం కాలువలు తవ్వి వదిలేసి, ఇప్పుడు అది తమ గొప్పతనమైనట్లు బీఆర్ఎస్ లీడర్లు పోటీ పడి అబద్ధాలు ఆడుతున్నారని మండిపడుతున్నారు కాంగ్రెస్ నేతలు.