QR Code Facility at Railway ticket Counters: రైల్వే టికెట్ కౌంటర్ల వద్ద టికెట్ల కొనుగోలు ఇకనుంచి అత్యంత సులభతరం కానున్నది. క్యూఆర్ కోడ్ ద్వారా డిజిటల్ చెల్లింపులు చేసే సదుపాయం అందుబాటులోకి తీసుకొచ్చినట్లు దక్షిణ మధ్య రైల్వే తాజాగా వెల్లడించింది. అయితే, తొలుత ప్రధాన రైల్వే స్టేషన్లలోనే ఈ సదుపాయం ఉండగా, ఇప్పుడు అన్ని స్టేషన్లకు విస్తరించినట్లు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో పేర్కొన్నది.
ఇందుకు సంబంధించి ఇతర మీడియాలో వచ్చిన కథనం ప్రకారం వివరాల్లోకి వెళితే.. రైల్వే స్టేషన్లలోని జనరల్ బుకింగ్, రిజర్వేషన్ కౌంటర్లలో క్యూఆర్ కోడ్ ను ఉపయోగించి ఇక నుంచి డిజిటల్ చెల్లింపులు చేయొచ్చని సౌత్ సెంట్రల్ రైల్వే స్పష్టం చేసింది. ఇందుకోసం అన్ని స్టేషన్లలోని టికెట్ విండో వద్ద ప్రత్యేక డివైజ్ ను ఉంచుతున్నట్లు పేర్కొన్నది. ప్రయాణికుడికి సంబంధించిన అన్ని వివరాలను కంప్యూటర్ లో ఎంటర్ చేసిన తరువాత, ఆ డివైజ్ లో క్యూఆర్ కోడ్ ప్రత్యక్షమవనున్నది. దీన్ని యూపీఐ యాప్స్ వినియోగించి చెల్లింపులు చేయొచ్చు. పేమెంట్ పూర్తయిన వెంటనే టికెట్ ను అందిస్తారు.
Also Read: హైదరాబాద్లో భారీ వర్షం.. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా..
సికింద్రాబాద్ వంటి ప్రధాన రైల్వే స్టేషన్లకే పరిమితమైన క్యాష్ లెస్ సదుపాయాన్ని జోన్ పరిధిలోని అన్ని రైల్వే స్టేషన్లకు విస్తరిస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది. ఇప్పటికే అన్ని స్టేషన్లకు డివైజులను పంపించామని, విడతల వారీగా మరికొన్ని రోజుల్లో అన్ని స్టేషన్లలో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయని పేర్కొన్నది. ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రయాణికులకు సూచించింది.