Rahul Gandhi: పశ్చిమ బెంగాల్పై దేశవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసుకు సంబంధించి భయానక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సామూహిక అత్యాచారం జరిగి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై పార్లమెంటులో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తాజాగా స్పందించారు. సోషల్ మీడియాలో ఆయన పోస్ట్ పెట్టారు. ఈ దారుణ ఘటనతో యావత్ దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడిందన్నారు. వైద్యవర్గాలు, మహిళల్లో అభద్రతా వాతావరణం ఏర్పడిందంటూ ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
‘బాధిత కుటుంబానికి న్యాయం చేయడానికి బదులు నిందితుడిని కాపాడేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఆసుపత్రి, స్థానిక యంత్రాంగంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మెడికల్ కాలేజీ వంటి ప్రదేశాల్లోనే డాక్టర్లకు భద్రత లేకపోతే, ఇగ పై చదువుల కోసం ఆడపిల్లలను వారి తల్లిదండ్రులు బయటకు ఎలా పంపిస్తారు? నిర్భయ కేసు తరువాత కఠిన చట్టాలు అమలవుతున్నప్పటికీ ఇటువంటి నేరాలను నిలువరించడంలో ఎందుకు విఫలమవుతున్నాం..? హాథ్రస్ నుంచి ఉన్నావ్, కథువా నుంచి కోల్కతా వరకు.. ఇలా వెలుగులోకి వస్తున్న ఘటనలపై ప్రతి రాజకీయ పార్టీ, సమాజం చర్చలు జరపాలి. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి’ అంటూ ఆయన ఆ పోస్ట్లో పేర్కొన్నారు. బాధిత కుటుంబానికి న్యాయం జరగాలని, దోషులకు తగిన శిక్ష విధించాలంటూ ఆయన డిమాండ్ చేశారు.
Also Read: ఆగస్టు 15న మొత్తం ఎన్ని దేశాలు స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకోనున్నాయంటే..?
ఇదిలా ఉంటే.. ఈ ఘటనపై కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ కూడా స్పందించారు. ఇది హృదయవిదారక ఘటన అంటూ ఆమె వ్యాఖ్యానించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక తృణమూల్ ప్రభుత్వాన్ని ఆమె కోరారు.
అఖిల భారత ప్రభుత్వ వైద్యుల సమాఖ్య అదనపు ప్రధాన కార్యదర్శి డా. సుబర్ణ గోస్వామి మాట్లాడుతూ.. ‘ఆమె శరీరానికి అయిన గాయాలు చూస్తుంటే ఒక వ్యక్తి మాత్రమే దాడి చేసినట్లుగా కనిపించటంలేదు. ఒక్కరు కాదు పలువురు కలిసి ఈ దారుణానికి పాల్పడి ఉండొచ్చు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి’ అంటూ పేర్కొన్నారు.