Pakistan Independence Day: భారత్, పాకిస్తాన్ ఈ నెలలోనే తమ 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాయి. భారత దేశంలో ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర్య దినోత్సవ సంబురాలు జరుపుకుంటే.. పాకిస్తాన్ మాత్రం ఒక రోజు ముందుగానే అంటే ఆగస్టు 14వ తేదీన ఈ వేడుకలు చేసుకుంటున్నది. 1947 ఆగస్టులో బ్రిటీష్ పాలకులు ఇండియాను రెండు దేశాలు ఇండియా, పాకిస్తాన్లుగా విభజించింది. అదే రోజున ఈ రెండు దేశాలకు స్వాతంత్ర్య వచ్చింది. కానీ, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు మాత్రం ఈ రెండు దేశాలు వేర్వేరు రోజుల్లో ఎందుకు జరుపుకుంటున్నాయి?
చరిత్ర ఏం చెబుతున్నది?
1947 ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ ఆధారంగా భారత్, పాకిస్తాన్ దేశాలు ప్రత్యేక దేశాలుగా ఏర్పడ్డాయి. ఇండియాలో రెండు ప్రత్యేక దేశాలు ఏర్పడుతాయని, అవి ఇండియా, పాకిస్తాన్ అని ఈ యాక్ట్ స్పష్టంగా చెబుతున్నది. వాస్తవానికి ఆగస్టు 15వ తేదీనే పాకిస్తాన్ స్వాతంత్ర్య పొందిన రోజు. పాకిస్తాన్ వ్యవస్థాపకుడు మొహమ్మద్ అలీ జిన్నా కొత్తగా ఏర్పడ్డ పాకిస్తాన్ దేశాన్ని ఉద్దేశిస్తూ చేసిన చారిత్రక రేడియో ప్రసంగం కూడా ఈ విషయాన్ని స్పష్టపరుస్తుంది. జిన్నా, ఆయన కేబినెట్ 1947 ఆగస్టు 15వ తేదీ ఉదయాన్నే ప్రమాణం చేశారు. 1948 జులైలో విడుదలైన పాకిస్తాన్ తొలి స్మారక పోస్టల్ స్టాంప్ కూడా 1947 ఆగస్టు 15వ తేదీని స్వాతంత్ర్యం పొందిన రోజుగా పేర్కొంది.
సీనియర్ పాకిస్తాన్ జర్నలిస్టు షహీదా కాజీ 2016లో ఓ ఇంటర్వ్యూలో కూడా ఆగస్టు 15వ తేదీనే పాకిస్తాన్ స్వాతంత్ర్య దినోత్సవమని, అదే తేదీన సంబురాలు జరుపుకోవాల్సిందనీ పేర్కొన్నారు.
పాకిస్తాన్ మాజీ ప్రధాని చౌదరి ముహమ్మద్ అలీ రాసుకున్న తన ‘పాకిస్తాన్ పుట్టుక’ పుస్తకంలో 1947 ఆగస్టు 15వ తేదీ ముస్లింలకు చాలా పవిత్రమైన రోజుగా పేర్కొన్నారు. 1947 ఆగస్టు 15వ తేదీన రంజాన్ మాసంలోని చివరి శుక్రవారం వచ్చిందని గుర్తు చేసుకున్నారు. అదే రోజున జిన్నా పాకిస్తాన్ గవర్నర్ జనరల్గా బాధ్యతలు తీసుకున్నారని, నక్షత్రం, నెలవంక జెండా ఆవిష్కరించబడిందని, ప్రపంచ పటంపై పాకిస్తాన్ దేశం అవతరించిందని వివరించారు.
1947 ఆగస్టు 14న ఏం జరిగింది?
వైశ్రాయ్ లార్డ్ మౌంట్బాటెన్ 1947 ఆగస్టు 14వ తేదీన పాకిస్తాన్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెంట్లో ఓ ప్రసంగం చేశారు. ఆగస్టు 15వ తేదీన అర్ధరాత్రి ఇండియా, పాకిస్తాన్లకు అధికారాన్ని బదలాయించేవాడు. కానీ, ఇది మౌంట్బాటెన్కు సాధ్యం కాలేదు. ఎందుకంటే న్యూఢిల్లీ, కరాచీలో ఆయన ఏకకాలంలే ఉండలేడు. అందుకే ఆగస్టు 14వ తేదీన కరాచీలో పాకిస్తాన్కు అధికారాన్ని బదలాయించి ఆ తర్వాత న్యూఢిల్లీకి వెళ్లాడు. అలాగని, ఆగస్టు 14నే పాకిస్తాన్కు స్వాతంత్ర్యం వచ్చిందని చెప్పలేమని, ఎందుకంటే ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ దీన్ని అంగీకరించదని ప్రముఖ పాకిస్తాన్ చరిత్రకారుడు ఖుర్షీద్ కమల్ అజీజ్ తన ‘మర్డర్ ఆఫ్ హిస్టరీ’ పుస్తకంలో పేర్కొన్నారు.
మరి తేదీ ఎందుకు ముందుకు జరిగింది?
ప్రతి సంవత్సరం ఆగస్టు 15వ తేదీనే ఇండియా తరహా పాకిస్తాన్ కూడా స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోవాల్సింది. కానీ, 1948లో పాకిస్తాన్ ఒక రోజును ముందుకు జరిపింది. 1948 నుంచి పాకిస్తాన్ ప్రతి యేటా ఆగస్టు 14వ తేదీనే స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నది. దీని వెనుక చాలా థియరీలు ఉన్నాయి. కొందరు పాకిస్తాన్ నాయకులు భారత్ కంటే ముందే స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోవాలనే కాంక్షను వెలుబుచ్చినట్టు కొన్ని కథనాలు వచ్చాయి.
Also Read: Dark Tourism: డార్క్ టూరిజం అంటే ఏమిటీ? కేరళ పోలీసులు ఎందుకు హెచ్చరిస్తున్నారు?
జూన్ 1948లో అప్పటి పాక్ పీఎం లియాకత్ అలీ ఖాన్ నేతృత్వంలో మంత్రివర్గం సమావేశమై ఇండిపెండెన్స్ డేను ఒక రోజు ముందుకు జరిపే నిర్ణయం తీసుకుంది. జిన్నా ఈ ప్రతిపాదనను సమ్మతించారు. కానీ, అందరూ ఒప్పుకోలేదు.
అప్పటి వరకు భారత్గా ఉన్న ఆ ప్రాంతం అప్పుడు కొత్త దేశంగా, పాకిస్తాన్గా ఏర్పడింది. స్వాతంత్ర్య పొంది ప్రత్యేక దేశంగా ఏర్పడినా.. భారత్ నీడలో ఉన్నట్టుగా ఉండకూడదని, దానికంటూ ప్రపంచంలో ఒక సొంత గుర్తింపు ఉండాలని ఆ దేశ నాయకులు భావించారని పాకిస్తాన్ చరిత్రకారులు, విద్యావంతులు చెబుతున్నారు. అందుకే భారత్ నిర్వహించుకునే ఆగస్టు 15కు భిన్నమైన తేదీని ఎంచుకోవాలని తమ దేశ నాయకులు ఎంచుకుని ఉండొచ్చని జర్నలిస్టు కాజీ ‘ది ఎక్స్ప్రెస్ ట్రిబ్యూన్’కు వివరించారు.