Bhagyashri Borse: టాలీవుడ్ లో ఏ కొత్త హీరోయిన్ వచ్చినా.. మొదట ఆమెను ఆకాశానికి ఎత్తేస్తారు. ఆ తరువాత నిదానంగా కిందకు దించడం అలవాటుగా మారిపోయింది. అప్పట్లో కృతి శెట్టి, మృణాల్, శ్రీలీల.. ఇలా చాలామంది హీరోయిన్స్ ఒక్క సినిమా రిలీజ్ కాకముందే వరుస సినిమా ఛాన్స్ లు అనుకోని.. బాగా హైప్ తెచ్చుకొని.. ఇప్పుడు నిదానంగా ఒక్కో సినిమా చేసుకుంటూ వస్తున్నారు. ఇక వీరి లిస్ట్ లో కొత్తగా చేరింది భాగ్యశ్రీ బోర్సే.
మిస్టర్ బచ్చన్ సినిమాతో ఈ చిన్నది తెలుగుతెరకు పరిచయమైంది. మొదటి సినిమా ఇంకా రిలీజ్ కూడా కాలేదు వరుస ఛాన్స్ లను పట్టేస్తుందని టాక్. రవితేజ హీరోగా నటించిన ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఆగస్టు 15 అనగా రేపు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. మిస్టర్ బచ్చన్ నుంచి అమ్మడి పోస్టర్ రిలీజ్ అయిన దగ్గరనుంచి.. సోషల్ మీడియా ఆమె నామజపం చేస్తున్న విషయం తెల్సిందే.
అందానికి అందం, అభినయం కలబోసిన ఈ భామ.. ప్రస్తుతం మిస్టర్ బచ్చన్ ప్రమోషన్స్ లో బిజీగా మారింది. తాజాగా దావత్ అనే చిట్ చాట్ కు వెళ్లిన ఈ చిన్నది.. తన మనసులోని మాటను బయటపెట్టింది. పీపుల్ మీడియా నిర్మిస్తున్న ఈ షో మొదటి సీజన్ కు రీతూ చౌదరి హోస్ట్ గా వ్యవహరించగా.. సెకండ్ సీజన్ కు అరియానా వచ్చి చేరింది.
ఇక ఈ షోలో అరియానా, భాగ్యశ్రీని కొన్ని ప్రశ్నలు అడిగింది. ఒకవేళ లిఫ్ట్ లో మీరు ఆగిపోవాలి అనుకుంటే.. ఏ స్టార్ హీరోతో ఆగిపోతారు అని అడగ్గా.. భాగ్యశ్రీ అస్సలు తడుముకోకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని చెప్పుకొచ్చింది. దీనికి అరియనా డిప్యూటీ సీఎం గారి కొత్త తాలూకా అని చెప్పడంతో నవ్వులు చిందించింది. ఇక ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. భాగ్యశ్రీ కూడా మన తాలూకానేనా అని పవన్ ఫ్యాన్స్ ఆ వీడియోను వైరల్ చేస్తున్నారు. మరి ముందు ముందు ఈ చిన్నది పవన్ తో నటించే అవకాశాన్నీ అందుకుంటుందేమో చూడాలి.