Varalakshmi Vratam 2024: హిందూ పంచాంగం ప్రకారం ఏటా శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు వరలక్ష్మీ వ్రతాన్నిఆచరిస్తారు. వరాలిచ్చే తల్లి వరలక్ష్మీ అష్టలక్ష్ముల్లో ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది. వివాహిత మహిళలు నిత్య సుమంగళిగా ఉండేందుకు వరలక్ష్మీ వ్రతం తప్పనిసరిగా ఆచరిస్తుూ ఉంటారు. ఈ ఏడాది ఆగస్టు 16 వ తేదీ వరకు వరలక్ష్మీ వ్రతాన్నిచేసుకోవచ్చు. ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా లక్ష్మీ దేవి అనుగ్రహం తమపై ఉంటుందని నమ్ముతుంటారు.
సంపద దేవత అయిన లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడంతో పాటు.. కుటుంబం, సంతోషం , శ్రేయస్సు కోసం ఈ వ్రతాన్ని జరుపుకుంటారు. వరలక్ష్మీ వ్రతాన్ని వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా ఆచరిస్తుంటారు. ఈ సందర్భంగా ఈ వ్రతం ఆచరించడం వల్ల కలిగే ప్రయోజనాలేంటి.. శ్రావణంలో ఈ వ్రతాన్నిఎందుకు ఆచరిస్తారనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
లక్ష్మీదేవిని పూజిస్తే..
శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున తెలుగు రాష్ట్రాలతో పాటు అనేక ప్రాంతాల్లో వరలక్ష్మీ వ్రతాన్ని జరుపుకుంటూ ఉంటారు. వివాహిత స్త్రీలు మాత్రమే ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. కొత్త జంటలు సంతానం కోసం, కుటుంబం జీవిత భాగస్వామి సంతోషం కోసం అంతే కాకుండా ఆదాయం, ఐశ్వర్య పెరగడానికి వ్రతాన్ని ఆచరిస్తారు, వరలక్ష్మీ దేవిని పూజిస్తే అష్టలక్ష్ములను పూజించినట్టే అని నమ్ముతుంటారు.
లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునేందుకు..
వరలక్ష్మీ వ్రతాన్ని దక్షిణ భారతదేశంలో ఘనంగా జరుపుకుంటారు. అయితే ఉత్తర భారతంలో ఈ వ్రతానికి పెద్దగా ఆదరణ లేదు. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునేందుకు, ఆశీస్సులు పొందేందుకు వరలక్ష్మీ వ్రతం అత్యంత పవిత్రమైన వ్రతాల్లో రోజుల్లో ఒకటిగా చెబుతుంటారు. ఈ వ్రతం చేసిన వారికి అమ్మవారి అనుగ్రహం తప్పక లభిస్తుందని నమ్ముతారు.
సుఖ సంతోషాల కోసం..
వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించడం వల్ల సంతానం లేని వివాహితులకు సంతాన భాగ్యం కలుగుతుందని.. పేదలకు ధన లాభం కలుగుతుందని విశ్వసిస్తారు. ఈ వ్రతాన్ని కేవలం మహిళలు ఆచరించడం అనేది ఆనవాయితీగా వస్తోంది . వరమహాలక్ష్మీ వ్రతాన్ని ఆచరించడం వల్ల ప్రతి ఒక్కరి జీవితంలో సుఖసంతోషాలు పెరుగుతాయి.
కష్టాలన్నీ తొలగిపోతాయి..
వరలక్ష్మీ వ్రతం సమయంలో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో నిజమైన విశ్వాసంతో పూజించిన వారు ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా సులభంగా ఎదుర్కుంటారు. అంతే కాకుండా వారి జీవితంలో కష్టాలన్నీ తొలగిపోయి సుఖసంతోషాలతో జీవించేందుకు అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి తమ వ్యక్తిగత జీవితంలో డబ్బు కూడా కొరత ఉండదు.
వరలక్ష్మీ వ్రత పూజా విధానం:
వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించి రోజున ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత పూజ గదిలో బియ్యం పిండితో ముగ్గులు వేసి కలశం ఏర్పాటు చేసుకోవాలి. వరలక్ష్మీ దేవి ఫోటో లేదా విగ్రహాన్ని సిద్ధం చేసుకుని పూజా సామగ్రితో తోరణాలు, అక్షంతలు, పసుపు గణపతిని సిద్ధం చేసుకొని ఉంచుకోవాలి. వీటిని అందంగా అలంకరించుకుని. అనంతరం వరలక్ష్మీ వ్రత కథను చదవాలి.