Army Captain killed: జమ్మూకాశ్మీర్ లో ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో జవాన్ ప్రాణాలు కోల్పోయాడు. ఇందుకు సంబంధించి ఇతర మీడియాలో వస్తున్న వివరాల ప్రకారం.. దోడా జిల్లాలో బుధవారం భద్రతా సిబ్బంది, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 48వ రాష్ట్రీయ రైఫిల్స్ కు చెందిన ఆర్మీ కెప్టెన్ దీపక్ సింగ్ అమరుడయ్యాడు. ఈ ఎన్ కౌంటర్ పరిసరాల్లో దొరికిన వస్తువుల ఆధారంగా నలుగురు ఉగ్రవాదులను కూడా మట్టుబెట్టినట్లు ఆర్మీ అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది. ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నట్లు సమాచారం.
అయితే, స్వాతంత్ర దినోత్సవం నేపథ్యంలో ఉదమ్ పూర్ లో ఉగ్రవాదులు నక్కినట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం అందడంతో వెంటనే అలర్ట్ అయిన భద్రతా సిబ్బంది ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలోనే మంగళవారం గాలింపు చేపట్టిన భద్రతా సిబ్బందిపై ఉగ్రవాదులు తొలుత కాల్పులు జరిపారు. దీంతో భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు జరిపారు. ఈ క్రమంలో ఉగ్రవాదులు దోడా జిల్లాల్లోని అడవుల్లోకి పారిపోయారు. వెంటనే భద్రతా సిబ్బంది కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నది.
Also Read: కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ నిరాకరించిన సుప్రీం కోర్టు.. విచారణ వాయిదా
శివ్ గఢ్ – అస్సార్ బెల్ట్ లో భద్రతా సిబ్బంది గాలింపు చేస్తున్న క్రమంలో నదీ ప్రాంతంలో నక్కి ఉన్న ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. ఇది గమనించిన భద్రతా దళాలు కూడా ఎదురుకాల్పులు జరిపాయి. ఈ ఎన్ కౌంటర్ లో ఆర్మీ కెప్టెన్ తీవ్రంగా గాయపడగా, ఆసుపత్రికి తరలించారు. హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూసినట్లు ఆర్మీ అధికారులు పేర్కొన్నారు.
ఈ ఆపరేషన్ లో నలుగురు ఉగ్రవాదులను భద్రతా సిబ్బంది హతమార్చినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఘటనా స్థలంలో అత్యాధునిక ఎం4 రైఫిల్ తోపాటు పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా వీటితోపాటు నాలుగు బ్యాక్ ప్యాక్ లను కూడా గుర్తించినట్లు అధికారులు పేర్కొన్నారు.