Varalakshmi Pooja: ప్రతీ ఏడాది వచ్చే శ్రావణ మాసంలో వరలక్ష్మీ వ్రతానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి ముందు శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతాన్ని జరుపుకుంటారు. ఆ శుక్రవారం నాడు వీలు కాని వారు శ్రావణం ముగిసేలోపు వచ్చే తరువాత శుక్రవారాల్లో కూడా వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వ్రతంలో సాక్షాత్తు తల్లి లక్ష్మీదేవిని పూజిస్తుంటారు. అమ్మవారిని నిండుగా అలంకరించి, వివాహిత స్త్రీలు తాము కూడా లక్ష్మీదేవి కల ఉట్టిపడేలా తయారై వ్రతాన్ని జరుపుకుంటారు. ఈ వ్రతానికి అసలు కథ ఏమిటంటే ఒక రోజు రాత్రివేళ చారుమతికి కలలో లక్ష్మీదేవి సాక్షాత్కరించింది. అందువల్ల సువాసినులందరూ కూడా ఈ వ్రతాన్ని ఆచరిస్తుంటారు. శ్రావణలో జరుపుకునే ఈ వ్రతం కారణంగా ఇంట్లోని పాపాలు తొలగిపోయి లక్ష్మీదేవి ప్రసన్నమవుతుందని నమ్ముతారు.
పూజా సామాగ్రి
కలశం, అమ్మవారి ఫోటో, పసుపు, కుంకుమ, గంధం, పువ్వులు, పూల మాలలు, తమలపాకులు, మామిడి ఆకులు, అరటి ఆకులు, వక్కలు, ఖర్జూరలు, అగరవత్తులు, కర్పూరం, చిల్లర డబ్బులు, పండ్లు, ఆకుపచ్చ లేదా ఎరుపు రంగు వస్త్రం, కొబ్బరి కాయలు, కంకణం, తెలుపు దారం, నైవేద్యాలు, బియ్యం, దీపపు కుందులు, నెయ్యి, పంచామృతాలు, హారతి కర్పూరం, ఒత్తులు, పంచామృతాలు
వ్రతం విధానం
ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి వాకిలి ఊడ్చి ముగ్గులు పెట్టుకోవాలి. అనంతరం ఇళ్లు, పూజ గది శుభ్రం చేసుకోవాలి. పూజ మందరింలో అమ్మవారి అలంకరణ కోసం ఏర్పాట్లు చేసుకోవాలి. బియ్యం పిండితో ముగ్గువేసి అందులో కలశం ఏర్పాటు చేసి అమ్మవారి అలంకరణ ప్రారంభించాలి. పూజాసామాగ్రితో పాటు పసుపుతో గణపతిని కూడా సిద్ధం చేసుకోవాలి.
తోరం తయారి విధానం
తోరం తయారు చేసుకోవడానికి తెల్లటి దారాన్ని తీసుకుని తొమ్మిది పోగులుగా అమర్చుకోవాలి. ఆ దారానికి పసుపు, కుంకుమను రాసుకుని తొమ్మిది ముడులు వేయాలి. అనంతరం ఐదు లేదా తొమ్మిది పువ్వులను తోరంకు ముడివేయాలి. దీనిని అమ్మవారి పీఠం వద్ద పెట్టుకుని పసుపు, కుంకుమ, అక్షింతలు తయారుచేసుకుని పూజను ప్రారంభించాలి.
గణపతి పూజ
అన్ని గణాలకు అధిపతి అయిన గణపతిని ముందుగా ప్రార్థించాలి. వరలక్ష్మీ వ్రతం పూజకు ముందు గణపతికి పూజ నిర్వహించాలి. ఈ తరుణంలో గణపతి విగ్రహం లేదా పసుపుతో తయారుచేసిన గణపతికి కుంకుమ, పువ్వులతో పూజ చేయాలి. ఈ తరుణంలో గణపతి స్తోత్రం చదువుతు పూజను నిర్వహించాలి.
వరలక్ష్మీ వ్రతం
గణపతి పూజ అనంతరం వరలక్ష్మీ కథను చదువుతూ అమ్మవారిని పూజించాలి. ఈ తరుణంలో పసుపు, కుంకుమ, పువ్వులను ఉపయోగించాలి. అమ్మవారిపై కుంకుమ, పువ్వులు, పసుపును చల్లుతూ కథ చదవాలి. ఇలా కథ ముగిసే వరకు అమ్మవారిని ప్రార్థిస్తూ భక్తి, శ్రద్ధలతో పూజ చేయాలి. పూజ ముగిసిన అనంతరం అమ్మవారికి నైవేద్యం సమర్పించి హారతి ఇచ్చిన అనంతరం కొబ్బరి కాయలు కొట్టాలి. ఆ తర్వాత తీర్థం తీసుకుని ఇంటికి వచ్చిన ముత్తయిదువులకు వాయినాలు ఇచ్చి వారి ఆశీర్వాదం తీసుకోవాలి.
(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)