Ishan Kishan: డబుల్ సెంచరీతో చెలరేగిన ఇషాన్ కిషన్.. తాను ఆ బాల్ కి అవుట్ కాకపోయి ఉంటే కచ్చితంగా త్రిపుల్ సెంచరీ చేసేవాడినని అన్నాడు. వన్డేల్లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ రికార్డు నెలకొల్పిన ఇషాన్.. 300 రన్స్ చేసే అవకాశాన్ని కోల్పోయినందుకు కాస్త అసంతృప్తిగా ఉందన్నాడు. 126 బంతుల్లోనే డబుల్ సెంచరీ బాదేసి.. క్రిస్ గేల్ (138 బంతుల్లో) పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు.
కెరీర్లో 10వ వన్డే ఆడిన ఇషాన్.. ద్విశతకంతో టాక్ ఆఫ్ ది మ్యాచ్ గా మారాడు. బంగ్లాదేశ్ తో మూడో వన్డేలో 134 బంతుల్లో 24 ఫోర్లు, 10 సిక్స్లతో 210 పరుగులు చేశాడు. 36వ ఓవర్లో భారీ షాట్ ఆడబోయి ఔట్ అయ్యాడు. “ఇంకా 15 ఓవర్లు మిగిలి ఉండగానే నేను ఔటయ్యాను. లేదంటే కచ్చితంగా 300 రన్స్ చేసి ఉండేవాడిని” అని అన్నాడు ఇషాన్ కిషన్.
విరాట్ కోహ్లీ అండతోనే తాను ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ రికార్డు సాధించగలిగానని అన్నాడు ఇషాన్. తాను 95 రన్స్ దగ్గర ఉన్నప్పుడు సిక్స్ కొట్టి సెంచరీ చేయాలని అనుకున్నానని.. కానీ కోహ్లీ తనను కూల్ చేశాడని చెప్పుకొచ్చాడు. తొలి సెంచరీ కాబట్టి సింగిల్స్తో కంప్లీట్ చేయమని విరాట్ తనకు సూచించాడని ఇషాన్ వివరించాడు. బ్యాటింగ్ చేసేందుకు పిచ్ బాగా సహకరించిందని.. బంతి కనిపిస్తే షాట్ కొట్టాల్సిందేనని తాను ఫిక్స్ అయ్యానని.. అలా దూకుడుగా ఆడానని చెప్పాడు.
ఇండియా తరఫున డబుల్ సెంచరీ చేసిన నాలుగో ఆటగాడు ఇషాన్ కిషన్. ఇప్పటివరకు వీరేంద్ర సెహ్వాగ్ (219), సచిన్ తెందూల్కర్ (200)లతో పాటు రోహిత్ శర్మ (264, 209, 208) మూడు సార్లు డబుల్ సెంచరీ సాధించారు. అలాంటి లెజెండ్స్ మధ్య తన పేరు ఉండటం గర్వంగా ఉందన్నాడు ఇషాన్ కిషన్.