Congress High Command meeting(Today news paper telugu): ఢిల్లీలో కాంగ్రెస్ హైకమాండ్ ఈ రోజు సమావేశమైంది. కాంగ్రెస్ ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే నేతృత్వంలో ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షులు, రాష్ట్రాల ఇంచార్జీలు, జనరల్ సెక్రెటరీలు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయాలు తీసుకుంది. కుల గణన, రిజర్వేషన్ల అంశంపై రాష్ట్రాల వారీగా సభలు నిర్వహించాలని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. ప్రతి బహిరంగ సభలో లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పాల్గొనాలని నిర్ణయం జరిగింది.
అదానీ, సెబీ మధ్యనున్న అపవిత్ర సంబంధంపై లోతైన దర్యాప్తు జరగాల్సి ఉననదని, సెబీ చైర్పర్సన్ను వెంటనే రాజీనామా చేయాలని మోదీ ప్రభుత్వం అడగాలని, ఈ వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీతో విచారణ జరిపించాలని డిమాండ్ చేయాలని ఈ భేటీలో కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. దేశంలో ప్రస్తుతం జరుగుతున్న మెగా స్కామ్ ఇదేనని కాంగ్రెస్ ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్ అన్నారు. సెబీ చైర్మన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సెబీ చైర్మన్ను పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 22వ తేదీన ప్రతి రాష్ట్ర రాజధానిలోని ఈడీ కార్యాలయాలను ఘెరావ్ చేస్తామని ప్రకటించారు.
హర్యానా, మహారాష్ట్ర, జమ్ము కశ్మీర్, ఢిల్లీ, బిహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలనూ పార్టీ నాయకులు ఈ సమావేశంలో చర్చించారు. కుల గణన జరిగితే వెనుకబడిన వర్గాలకు ప్రయోజనం దక్కుతుందని కాంగ్రెస్ స్పష్టం చేసింది. నిరుద్యోగం, అదుపుతప్పిన ద్రవ్యోల్బణం, నిండుకున్న ప్రజల ఆదాయం వంటి ముఖ్యమైన ఆర్థిక అంశాలపై మాట్లాడాలని నిర్ణయించినట్టు ఖర్గే ట్వీట్ చేశారు.
Also Read: Paris 2024 Olympics medal tally: పతకాల వేటలో టాప్ టెన్ దేశాలివే.. అమెరికా నెంబర్ వన్
రైతులకు కనీస మద్దతు ధర, దేశభక్తి గల యువతకు అగ్నిపథ్ పథకాన్ని తొలగించాలని, తరుచూ జరుగుతున్న రైలు ప్రమాదాలనూ లేవనెత్తుతామని నిర్ణయం తీసుకున్నట్టు ఖర్గే పేర్కొన్నారు.
సమావేశం తర్వాత ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మీడియాతో మాట్లాడారు. రానున్న రోజుల్లో ప్రజల్లోకి ఏ అంశాలను లేవనెత్తుతూ వెళ్లాలనేదానిపై అందరి అభిప్రాయాలు తీసుకున్నారని షర్మిల వివరించారు. కుల గణన అంశంపై పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీనే లేవనెత్తిందని తెలిపారు. బీజేపీ భారత రాజ్యాంగాన్ని గౌరవించడం లేదని తీవ్ర ఆరోపణలు చేశారు. వక్ఫ్ చట్ట సరవణలతో మైనార్టీల మనోభావాలను దెబ్బతీసేయాల బీజేపీ వ్యవహరిస్తున్నదని పేర్కొన్నారు. సెబీ-అదానీ అంశం కూడా చర్చకు వచ్చిందని, సెబీని తన గుప్పెట్లో పెట్టుకుని అదానీని ప్రధాని మోదీ కాపాడుతున్నారని ఆరోపించారు. రాజ్యాంగవ్యతిరేక బీజేపీ తీరుపై రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ఉధృతంగా పోరాటం చేస్తుందన్నారు. కుల గణనపై గ్రామస్థాయిలో కాంగ్రెస్ పోరాటాలు చేస్తుందని వివరించారు.
Also Read: Warangal: కనువిందు చేయనున్న 40 ఫీట్ల మట్టి గణపతి, ఫస్ట్ టైం ఓరుగల్లులో..!
అవినీతి రహిత పాలన అంటూ బీజేపీ గొప్పలు చెప్పుతున్నదని, వాస్తవంలో వారి మాటలు అబద్ధాలని తేలిపోతున్నదని వైఎస్ షర్మిల పేర్కొన్నారు. అదానీ, మోదీల అవినీతిని రాహుల్ గాంధీ ఎప్పుడో ఎండగట్టారని వివరించారు. అదాని మోదీ గ్రూప్ అని, అదాని మోదీ బినామీ అని ఆరోపణలు సంధించారు. అదానీని కాపాడే విషయంలో మోదీ చేస్తున్న ప్రయత్నాలను ఎండగడతామని, క్షేత్రస్థాయిలో మోదీ అవినీతిని తీసుకెళ్లే కార్యచరణ తీసుకుంటామని వెల్లడించారు.