Hydraa Commissioner: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై కేసు నమోదైంది. నందగిరిహిల్స్లోని జీహెచ్ఎంసీకి చెందిన ప్రహరీ గోడ కూల్చివేత ఘటనకు సంబంధించి జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసులో దానం నాగేందర్ను ఏ3గా చేర్చారు. తనపై కేసు నమోదైన నేపథ్యంలో ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందిస్తూ.. హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై సీరియస్ అయ్యారు. ఆయనకు కొత్తగా వచ్చిన పదవి ఇష్టం లేనట్టు ఉన్నదని పేర్కొన్నారు. అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, అధికారులకు ప్రివిలేజ్ నోటీసుల పంపిస్తామని వివరించారు. సీఎం రేవంత్ రెడ్డికి కూడా తాను ఫిర్యాదు చేస్తానని స్పష్టం చేశారు.
జూబ్లీహిల్స్ డివిజన్లోని నందగిరి హిల్స్లో ప్రజలకు ఇబ్బంది కలుగుతున్న విషయం తనకు తెలిసిందని, ఒక ప్రజా ప్రతినిధిగా తాను అక్కడికి వెళ్లానని ఎమ్మెల్యే దానం వివరించారు. తనను అడ్డుకునే అధికారం ఏ అధికారికీ లేదని స్పష్టం చేశారు. ప్రజా ప్రతినిధిగా ప్రజల సమస్యలు తీర్చడం తన బాధ్యత అని, కేసులు నమోదైతే భయపడబోనని, తనకు కేసులు కొత్తేమీ కాదని చెప్పారు.
Also Read: Commissioner Ranganath: ఆ ప్రాంతాల్లో స్థలాలను ఎవరూ కొనకండి: రంగనాథ్
జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 69 నందగిరిహిల్స్లో జీహెచ్ఎంసీకి చెందిన ప్రహారి గోడను ఈ నెల 10వ తేదీన కొందరు కూల్చేసినట్టు ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ గుర్తించింది. ఎమ్మెల్యే దానం నాగేందర్ సమక్షంలోనే ఈ కూల్చివేత జరిగిందని, గురుబ్రహ్మనగర్కు చెందిన గోపాల్ నాయక్, రాంచందర్ సహా పలువురు ఈ కూల్చివేతలో ఉన్నారని ఎన్ఫోర్స్మెంట్ ఇంచార్జీ పాపయ్య గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ప్రహరీ గోడను కూల్చడం వల్ల రూ. 10 లక్షల మేర నష్టం వాటిల్లిందని తెలిపారు.