Paris Olympics 2024 is the Highest Prize Money for Medal Winning Athletes: భారతీయులు ఎంతో ఉద్విగ్నంగా ఎదురుచూసిన ఒలింపిక్స్ విశ్వ క్రీడలు ఘనంగా ముగిశాయి. అయితే ఎంతో ఉత్సాహంగా వెళ్లిన 117 మంది భారత అథ్లెట్లు.. కేవలం 6 పతకాలు మాత్రమే సాధించి తిరిగొచ్చారు. గతంలో జరిగిన టోక్యో ఒలింపిక్స్ లో 7 పతకాలు సాధించారు. ఈసారి ఒకటి తగ్గింది. అయితే వినేశ్ ఫోగట్ వివాదం లేకపోతే అది కూడా వచ్చేదే.. ఈరోజు సాయంత్రం ఆ అంశంపై కాస్ కోర్టు తీర్పు వెలువరించనుంది.
ఇకపోతే పతకాలు సాధించిన ఒలింపిక్ వీరులకు కాసుల వర్షం కురుస్తోంది. ప్రైజ్ మనీతో కేంద్ర రివార్డులతో పాటు పలు రాష్ట్ర ప్రభుత్వాలు వారికి నజరానాలు ప్రకటించాయి. కోన్ని కార్పొరేట్ సంస్థలు కూడా వారికి భారీగా నజరానాలు ఇవ్వనున్నారనే ప్రచారం జరుగుతోంది. మరి ఇంతవరకు వచ్చినవేమిటో ఒకసారి చూద్దాం.
నీరజ్ చోప్రా –
24ఏళ్ల నీరజ్ చోప్రా మరోసారి భారతదేశానికి పతకాన్ని తెచ్చిపెట్టాడు. అందరూ కాంస్య పతకాలు మాత్రమే, తీసుకొస్తే తనొక్కడే రజత పతకాన్ని అందించాడు. టోక్యో ఒలింపిక్స్ లో నీరజ్ స్వర్ణం సాధించాడు. ఇప్పుడు అదే వస్తుందని అంతా అంచనా వేశారు. క్వాలిఫై రౌండులో వేసిన రికార్డ్ స్పీడు, పతకాలు తెచ్చినప్పుడు పడలేదు. దీంతో రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
మనుబాకర్ (షూటింగ్)
ఒకే ఒలింపిక్స్లో రెండు పతకాలు సాధించిన క్రీడాకారిణిగా మను బాకర్ నిలిచారు. 10మీటర్ల పిస్టల్ వ్యక్తిగత విభాగంతో పాటు సరబ్తో కలిసి మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో కాంస్యం గెలుచుకున్నారు. తనకి కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ రూ.30 లక్షల రివార్డు ప్రకటించారు. ఇంకా సొంత రాష్ట్రం హర్యాణా నుంచి ప్రకటన రావల్సి ఉంది. గతంలో తనకి కోటి రూపాయలు ఇస్తామని హర్యాణా ప్రభుత్వం ఇవ్వలేదని మను చెప్పడం అప్పుడు వివాదమైంది. అది మనసులో పెట్టుకుని ప్రకటించలేదని కొందరు అంటున్నారు.
స్వప్నిల్ కుశాలె (షూటింగ్) –
పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్ విభాగంలో స్వప్పిల్ కాంస్యాన్ని అందుకున్నాడు. ఇప్పటివరకూ ఈ విభాగంలో పతకం అందుకున్న తొలి అథ్లెట్ తనే కావడం విశేషం. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే రూ.కోటి నజరానా ప్రకటించారు. అలాగే సెంట్రల్ రైల్వేలో స్పెషల్ ఆఫీసర్గా కూడా ఉద్యోగం లభించింది. ఇది కేవలం గౌరవార్థం ఇచ్చిందే. తన ప్రాక్టీసుకి ఏ మాత్రం అడ్డంకులు ఉండవు. తను ఖాళీగా ఉన్నరోజుల్లో వెళ్లి ఉద్యోగం చేసుకోవచ్చు. లేదంటే తను రిటైర్మైంట్ అయిన తర్వాత…అదే ఉద్యోగం తనకి ఆసరాగా ఉంటుందని అంటున్నారు.
పురుషుల హాకీ జట్టు
ఒలింపిక్స్ లో వరుసగా రెండోసారి హాకీ జట్టు కాంస్య పతకాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో హాకీ ఇండియా.. ఒక్కో ప్లేయర్ కు రూ.15 లక్షలు నగదు బహుమతి ప్రకటించింది. సహాయక సిబ్బంది ఒక్కొక్కరికి రూ.7.5 లక్షల చొప్పున అందించనున్నారు. ఇకపోతే హాకీ జట్టు మొత్తానికి పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ రూ.కోటి నగదు బహుమతి ప్రకటించారు.
సరబ్ జోత్ సింగ్ (షూటింగ్)
10 మీటర్ల మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో మనుబాకర్తో కలిసి సరబ్ కాంస్య పతకాన్ని అందుకున్నాడు. కేంద్ర క్రీడల శాఖ మంత్రి అతనికి రూ.22.5 లక్షల రివార్డు ప్రకటించింది. ఇకపోతే హర్యాణా ప్రభుత్వం గవర్నమెంట్ ఉద్యోగం ఆఫర్ చేసింది. తన దృష్టి అంతా షూటింగ్పైనే ఉందని, ఆ ఉద్యోగాన్ని సున్నితంగా తిరస్కరించాడు.
అమన్ సెహ్రావత్ (రెజ్లింగ్)
రెజ్లింగ్ లో మల్లయోధులందరూ వెనుతిరగగా.. భారత్ తరఫు నుంచి ఒక్కడు మాత్రం ఉడుంపట్టు పట్టి కాంస్య పతకాన్ని చేజిక్కించుకున్నాడు. భారతదేశం మల్లయోధులకు పుట్టినిల్లు. అలాంటి చోట నుంచి వెళ్లిన భారత రెజ్లర్ అమన్ పారిస్ ఒలింపిక్స్ లో మన దేశ ఉనికిని చాటాడు. 57 కిలోల విభాగంలో ఈ ఘనత సాధించాడు. తనకి ఇంకా నగదు బహుమతిని ప్రకటించలేదు.