Congress: టీపీసీసీలో కీలక మార్పులు చేసింది హైకమాండ్. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రతిపాదనలు అన్నిటికీ దాదాపు ఆమెదం లభించింది. ఎప్పుడూ ఆ పాత విధానమేనా? ఇప్పుడు ట్రెండ్ మారింది. టీఆర్ఎస్, బీజేపీలకు ధీటుగా పోరాడాలంటే.. కాంగ్రెస్ కొత్త జవసత్వాలు సంతరించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే, డైనమిక్ లీడర్ రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ కాంగ్రెస్ కొత్త పుంతలు తొక్కుతోంది. తాజాగా, పార్టీ అధిష్టానం టీపీసీసీలో కొత్త కమిటీలు ఏర్పాటు చేసింది.
18 మందితో పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ.. 40 మందితో ఎగ్జిక్యూటివ్ కమిటీ.. 26 జిల్లాలకు కొత్త అధ్యక్షులను ప్రకటించింది ఏఐసీసీ. ఇక, జగ్గారెడ్డి, అజారుద్దీన్, అంజన్ కుమార్, మహేష్ గౌడ్ లను వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియమించింది. అయితే, టికాంగ్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేరు ఎందులోనూ లేకపోవడం ఆసక్తికరం.
పీసీసీ చీఫ్ పదవికే పోటీపడి.. రేవంత్ రెడ్డిని పదే పదే విమర్శించి.. రేవంత్ ను ఎలాగైనా పీసీసీ పీఠం నుంచి దించేయాలని చూస్తున్న వెంకట్ రెడ్డి పేరు పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలో లేకపోవడం ఆయనకు బిగ్ షాక్. మునుగోడు ఎన్నికల సమయంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఓ కాంగ్రెస్ నేతకు ఫోన్ చేసి.. బీజేపీ అభ్యర్థి, తన సోదరుడైన రాజగోపాల్ రెడ్డికి ఓటేయాలని పిలుపు ఇవ్వడంపై అధిష్టానం సీరియస్ గా స్పందించింది. వెంకట్ రెడ్డికి షోకాజ్ నోటీసులు కూడా ఇచ్చింది. ఆ వాయిస్ తనది కాదంటూ ఆయన వివరణ కూడా ఇచ్చారు. కానీ, ఇప్పటి వరకైతే క్రమశిక్షణ కమిటీ నుంచి ఎలాంటి స్పందన లేదు.
ఇలా, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్ లో ఒంటరివాడయ్యారు. తాజాగా ప్రకటించిన కమిటీల్లోనూ ఆయన పేరు లేకపోవడం.. ఒకవిధంగా పొమ్మనేలా పొగబెట్టడమే..అంటున్నారు. సీనియర్ నేతను వెళ్లగొట్టలేక.. ఆయనే వెళ్లిపోయేలా.. పక్కన పెట్టేశారని చెబుతున్నారు. మరి, కోమటిరెడ్డి రియాక్షన్ ఎలా ఉంటుందో..?