KCR plan to go forign with MLAs and MLCs to avoid party jumpings: రాష్ట్ర రాజకీయాలతో బీఆర్ఎస్ నేతలు నలిగిపోతున్నారు. ఎప్పుడు ఏ నిమిషంలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. ఇప్పటికే పది మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో జంప్ చేశారు. రేవంత్ రెడ్డి విదేశాలకు వెళ్లి రాగానే మరి కొందరు నేతలు పార్టీని వీడేందుకు సిద్ధపడుతున్నారు. అప్పటిదాకా పార్టీ మారనని హామీ ఇస్తున్న నేతలు రాత్రికి రాత్రే మనసు మార్చేసుకుంటున్నారు. గుట్లుగా చడీచప్పుడు కాకుండా పార్టీ కండువాలు మార్చేసుకుంటున్నారు. రోజురోజుకూ తలనొప్పిగా తయారవుతున్నారు నేతలు. దీనితో కేసీఆర్ కొత్తగా ఓ భారీ స్కెచ్ వేశారు. వలసలను నియంత్రించడానికి ఏకంగా విదేశాలకు పయనమయ్యేందుకు సిద్ధం అవుతున్నారు.
విదేశానికి వెళ్లే యత్నం
ఎవరికీ అనుమానం కలగకుండా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు విదేశాలకు టిక్కెట్లు బుక్ చేసినట్లు సమాచారం. వీరంతా ఒక్కసారే వెళితే అనుమానం వస్తుందని భావించి ఒక్కో టీమ్ గా విభజించి మరీ పంపుతున్నారు. ముందుగా అక్కడికి కేసీఆర్ చేరుకుంటారు. వీళ్లందరితో పాటు కేటీఆర్, హరీష్ లుకూడా అక్కడికి చేరుకుంటారని సమాచారం. అయితే ఈ విషయాలను గోప్యంగా ఉంచాలని పార్టీ శ్రేణులకు తెలిపారు. ముఖ్యంగా కింది స్థాయి నేతలకు కూడా ఈ విషయాలు తెలియకుండా విదేశాలకు పయనమయ్యేందుకు సిద్ధం అవుతున్నారు. అక్కడే పార్టీ కీలక సమావేశం ఏర్పటు చేసి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు విందు, వినోదాలు ఏర్పాటు చేసి పార్టీని ఎవరూ వీడకండి అంటూ వారికి భారీ ఆఫర్లు సైతం ఇవ్వనున్నారని సమాచారం. ఎలాంటి పరిస్థితి వచ్చినా కాంగ్రెస్ గానీ ఇతర పార్టీలకు గానీ వలస పోమని వారి వద్ద నుంచి స్పష్టమైన హామీ తీసుకుంటారని సమాచారం. ఇందుకు సంబంధించి వారు పార్టీ అధినేతలనుంచి ఏమి కోరుకుంటున్నారు? ఏమి ఆశిస్తున్నారో విషయాలను రాబట్టి వారిలోని అసంతృప్తిని చల్లబరిచే ప్రయత్నం చేస్తారట. మామూలుగా ఇక్కడే లోకల్ గా సమావేశం ఏర్పాటు చేస్తే పలువురు నేతలు డుమ్మా కొట్టే ఛాన్స్ ఉంది. పైగా ఇక్కడ విషయాలన్నీ ఆఘమేఘాలమీద లీక్ అవుతున్నాయి. అందుకే గులాబీ బాస్ కేసీఆర్ ఇప్పుడు సీరియస్ గా ఈ అంశంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
కొంత కాలం వలసలకు చెక్
విదేశానికి వచ్చిన నేతలు ఎలానూ మీటింగును తప్పించుకునే పరిస్థితి ఉండదు. పైగా తమ మనసులోని మాటను నిర్మొహమాటంగా అగ్రనేతలకు చెప్పుకోవచ్చు. అయితే అందరినీ కలిపి మీటింగ్ ఏర్పాటు చేస్తారా లేక ఒక్కొక్కరితో విడివిడిగా మీటింగ్ ఏర్పాటు చేస్తారా అనేది సీక్రెట్. ఏది ఏమైనా వలసలను కొంత కాలం ఆపగలిగితే ఈ లోగా స్థానిక ఎన్నికలు వస్తాయి. అప్పుడు ఎలాగూ ఏదో ఒక పార్టీ అండ కావాలి కాబట్టి సొంత పార్టీనే నమ్ముకుంటారు. పైగా క్షేత్ర స్థాయిలో బీఆర్ఎస్ కు ఎలాగూ మంచి క్యాడర్ ఉంది. అధికార కాంగ్రెస్ పార్టీని ఓడించే సత్తా కూడా ఉంది. దీనితో వలస వెళ్లే నేతలు తమ మనసు మార్చుకునే అవకాశం కూడా ఉంటుందని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
పక్కా ప్లానింగ్
ఈ వ్యవహారంలో కర్త, కర్మ, క్రియ అన్నీ తానై నడిపించాలని..అటు కేటీఆర్, హరీష్ రావుల ప్రమేయం లేకుండా చాలా గుట్టుగా దీనిని సక్సెస్ చేయాలని కేసీఆర్ భావిస్తున్నారట. ఒక రకంగా చూస్తే రిసార్ట్ రాజకీయాల మాదిరిగానే భారీ స్కెచ్ వేశారు కేసీఆర్. అలాగే వీళ్లను ఉపయోగించుకుని పార్టీని వీడిన నేతలను కూడా తిరిగి ఘర్ వాపసీ ద్వారా వెనక్కి రప్పించే ఆలోచన చేస్తున్నారట కేసీఆర్. ఇందుకోసం భారీగానే డబ్బులు ఖర్చుపెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. బీఆర్ఎస్ వలసలతో పార్టీని విలీనం చేయాలనే రేవంత్ రెడ్డి ఆలోచనకు చెక్ పెట్టే యత్నంలో భాగమే ఇదంతా. మొత్తానికి కేసీఆర్ ప్లాన్ సక్సెస్ అయితే భారీ వలసలకు అడ్డుకట్ట వేసినట్లే.