Cheapest Recharge Plan: ప్రముఖ టెలికాం రంగ సంస్థలైన ఎయిర్టెల్, రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా ఇటీవల తమ మంత్లీ, ఇయర్లీ రీఛార్జ్ ప్లాన్లను భారీగా పెంచేశాయి. ఈ క్రమంలో ఇదే అదునుగా భావించిన ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ యూజర్లను ఆకట్టుకునేందుకు చాలా తక్కువ ధరకే రీఛార్జ్ ప్లాన్లను అందుబాటులోకి తెచ్చింది. అంతేకాకుండా తమ సిమ్ కార్డ్ యూజర్లకు తక్కువ ధరలో ఎక్కువ రోజులు వ్యాలిడిటీ గల ప్లాన్లను అందిస్తుంది. దీంతో బిఎస్ఎన్ఎల్కు మంచి ఆదరణ లభించింది.
ఈ దెబ్బతో ఎయిర్టెల్, జియో, వొడాఫోన్ ఐడియా యూజర్లు బీఎస్ఎన్ఎల్కు పోర్టింగ్ పెట్టుకుంటున్నారు. ఈ తరుణంలో త్వరలో 4జీ నెట్వర్క్ సేవలను బీఎస్ఎన్ఎల్ ప్రారంభించడానికి రంగం సిద్ధం చేసింది. ఏకంగా దేశవ్యాప్తంగా ఒక లక్ష టవర్లను ఏర్పాటు చేస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పటికే ఎన్నో రీఛార్జ్ ప్లాన్లను తక్కువ ధరకు అందించిన టెలికాం కంపెనీ తాజాగా మరొక చీపెస్ట్ ప్లాన్ను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో భాగంగా అతి తక్కువ ధరలో ఎక్కువ రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. అదే రూ.197 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్.
Also Read: జియో, ఎయిర్టెల్లను దెబ్బతీసేలా BSNL కొత్త రీఛార్జ్ ప్లాన్.. వారెవ్వా అదిరిపోయింది!
బీఎస్ఎన్ఎల్ రూ.197 ప్లాన్
బీఎస్ఎన్ఎల్ తీసుకొచ్చిన రూ.197 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ద్వారా వినియోగదారులు ఏకంగా 70 రోజుల వ్యాలిడిటీ పొందుతారు. ఈ ప్లాన్లో అన్లిమిటెడ్ కాలింగ్, ఇంటర్నెట్, ఎస్ఎంఎస్ వంటి అనేక ప్రయోజనాలను ఈ ప్లాన్ ద్వారా పొందవచ్చు. కాగా ఈ ప్లాన్లో భాగంగా తొలి 15 రోజుల పాటు డైలీ 2జీబీ డేటా లభిస్తుంది. అలాగే అన్లిమిటెడ్ కాలింగ్, ఎస్ఎంఎస్ ప్రయోజనాలను తొలి 15 రోజులపాటు పొందవచ్చు. అయితే ఈ ప్లాన్ ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే.. సిమ్ కార్డును ఎక్కువ రోజుల పాటు యాక్టివ్గా ఉంచేందుకు ఉపయోగపడుతుంది.
ఇదిలా ఉంటే టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే సందర్భంగా కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రోజు నుంచి దేశ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలను ప్రారంభించనుంది. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయినట్లు కేంద్ర మంత్రి జోతిరాధిత్య సింధియా ఇటీవల తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సెప్టెంబర్ చివరి నాటికి 4జీ సేవలు అందుబాటులోకి రానున్నాయని తెలుస్తోంది.