Adibatla Kidnap Case Updates : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్ ఆదిభట్ల మన్నెగూడ యువతి కిడ్నాప్ కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డి సహా 32 మందిని పోలీసులు….. అరెస్ట్ చేసి, ఆదిభట్ల పీఎస్కు తరలించారు. వీరందరినీ కాసేపట్లో కోర్టు ఎదుట హాజరుపర్చనున్నారు. ఉదయం నుంచి ప్రధాన నిందితుడి అరెస్టుపై పోలీసులు స్పష్టత ఇవ్వలేదు. కానీ.. కాసేపటి క్రితం అధికారికంగా ప్రకటించారు. నిందితులపై హత్యాయత్నం, కిడ్నాప్ కేసులు నమోదు చేసినట్టు ఆదిభట్ల సీఐ నరేందర్ వెల్లడించారు.
తాను ప్రేమించిన యువతికి… మరొకరితో వివాహం కుదిరిందని, శుక్రవారం మన్నెగూడలోని ఆమె నివాసం నుంచి నిందితుడు నవీన్ రెడ్డి కిడ్నాప్ చేశాడు. నిశ్చయ తాంబూలాలకు పెళ్లికొడుకు, బంధువులు రాకముందే ఉదయం 11 గంటలకు 5 కార్లు, డీసీఎం, ద్విచక్ర వాహనాల్లో సుమారు 100 మందితో నవీన్రెడ్డి.. యువతి ఇంటిపై దాడి చేశాడు. ఫర్నిఛర్, సీసీ కెమెరాలు, ఫోన్లు పగలగొట్టారు. అడ్డొచ్చిన యువతి తండ్రిని తీవ్రంగా కొట్టారు. తల్లిని పక్కకు నెట్టారు. ఓ బంధువును ఇనుపరాడ్లతో కొట్టారు. యువతిని నవీన్రెడ్డి కారులో అపహరించుకుపోయాడు. సుమారు 40 నిమిషాల పాటు గొడవ జరిగింది. పక్కా రెక్కీతో యువతి అపహరణ జరిగింది. ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు… ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి… 6 గంటల్లో యువతి ఆచూకీ కనుక్కున్నారు.
యువతి అపహరణకు ముందు అనుచరులు, తన టీ దుకాణాల్లో పని చేసే సిబ్బందిని నవీన్రెడ్డి ఆఫీసుకు పిలిచాడు. మద్యం పార్టీ ఏర్పాటు చేశాడు. మద్యం మత్తులో ఉన్నవారిని…. కారులో యువతి ఇంటికి తీసుకెళ్లాడు. యువతి ఇంటిపై నవీన్ అనుచరులు, సిబ్బంది దాడి చేశారు. ప్రణాళిక ప్రకారమే యువతి ఇంటికి అందర్ని నవీన్ తీసుకొచ్చాడు. యువతి కిడ్నాప్ తర్వాత వివిధ మార్గాల్లో దుండగులు పారిపోయారు.