Manipur: ఈశాన్య రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మణిపూర్ లో బాంబు పేలి మాజీ ఎమ్మెల్యే సతీమణి మృత్యువాతపడింది. అదేవిధంగా తెంగ్నౌపాల్ జిల్లాలో ఉగ్రవాదులకు, గ్రామ వాలంటీర్లకు మధ్య జరిగిన కాల్పుల్లో నలుగురు వ్యక్తులు మృతిచెందినట్లు పోలీసులు పేర్కొన్నారు.
ఇతర మీడియా కథనాల ప్రకారం వివరాల్లోకి వెళితే.. మణిపూర్ లోని కాంగ్ పోక్పి జిల్లాలో బాంబు పేలుడు ఘటన చోటు చేసుకున్నది. శనివారం సైకుల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే యమ్ థాంగ్ హౌకిప్ ఇంటి పక్కనే బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో హౌకిప్ రెండో భార్య సపం చారుబాలా తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించగా ఆమె మృతిచెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. అయితే, పేలుడు సమయంలో హౌకిప్ కూడా ఇంట్లోనే ఉన్నప్పటికీ ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Also Read: వైద్యురాలి నోరు, కళ్లు, ప్రైవేట్ పార్టుల నుంచి బ్లీడింగ్.. ఒకరు అరెస్టు
ఇది ఇలా ఉంటే.. మణిపూర్ లోని తెంగ్నౌపాల్ జిల్లాలో తాజాగా ఉగ్రవాదులు, గ్రామ వాలంటీర్ల మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో నలుగురు వ్యక్తులు మృతిచెందారు. యునైటెడ్ కుకీ లిబరేషన్ ఫ్రంట్ కు చెందిన ఒక ఉగ్రవాది, ముగ్గురు గ్రామ వాలంటీర్లు మోల్నోమ్ ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో మరణించారు. గతేడాది మే నుంచి మణిపూర్ లోని ఇంఫాల్ వ్యాలీకి చెందిన మెయిటీస్, పక్కనే ఉన్న కొండల ఆధారిత కుకీల మధ్య జరిగిన జాతి హింసలో వందల సంఖ్యలో ప్రజలు మృతిచెందిన విషయం తెలిసిందే.