Gujarat: ఆ టీచర్ గుజరాత్లోని ఓ పాఠశాలలో చదువు చెబుతున్నట్టుగా రికార్డు ఉన్నది. కానీ, ఆమె చెప్పరు. స్కూల్ ముఖం కూడా చూడరు. కానీ, నెల నెలా జీతం మాత్రం ఠంచనుగా ఆమె ఖాతాలో పడిపోతున్నాయి. ఆమె స్కూల్కు రాకపోవడమే కాదు.. అసలు ఆమె ఈ దేశంలోనే లేరు. అమెరికాలో సెటిలయ్యారు. గ్రీన్ కార్డు కూడా పొందిన ఆమె బ్యాంకు ఖాతాలో ఎనిమిదేళ్లుగా గుజరాత్ ప్రభుత్వం వేతనం జమ చేసింది.
గుజరాత్లో బనస్కంత జిల్లాలోని ఓ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో భావన పటేల్ అనే హెడ్ టీచర్ ఉన్నారు. ఆమె అఫీషియల్గా ఫైల్స్లో, రోస్టర్లో మాత్రమే కనిపిస్తారు. ప్రత్యక్షంగా ఆ స్కూల్లో కనిపించే వారు కాదు. ఐదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి.. భావన పటేల్ మేడంను చూసి రెండేళ్లు గడిచిందని చెప్పాడు. గ్రామస్తులకూ ఆ టీచర్ ఎలా ఉంటారో తెలియదు. విద్యార్థులు, గ్రామస్తులు కలిసి భావన పటేల్ అనే టీచర్ను తాము పాఠశాలలో ఎన్నడూ చూడలేదని ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం బయటపడింది. స్కూల్ పే రోల్లో భావన పటేల్ పేరు ఉన్నదని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.
స్థానిక మీడియా ప్రకారం, భావన పటేల్ 2013 నుంచి అమెరికాలోని షికాగోలో నివసిస్తున్నారు. ఆమెకు అమెరికా గ్రీన్ కార్డు ఉన్నది. ఆమె అమెరికాలో సెటిలైనా.. ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలో మాత్రం ఉద్యోగిగానే స్కూల్ రోస్టర్ ప్రస్తావించేది.
Also Read: YouTube: యూట్యూబ్లో ‘నెమలి కూర’ వంటకం.. జంతుప్రేమికుల ఆగ్రహం!
భావన పటేల్ ప్రతి యేడాది దీపావళి పండుగ కోసం ఇండియాకు వస్తుంటారు. ఆ సమయంలో పాఠశాలలు మూసే ఉంటాయి. ఆ సమయంలో కూడా స్కూల్ గురించి తెలుసుకునేవారు కాదు.. విద్యార్థులతో ఇంటరాక్ట్ కూడా ఆమె కాలేదు. కాగా, ఈ వ్యవహారంపై స్కూల్ ఇంచార్జి ప్రిన్సిపల్ పారుల్ మెహెతా స్పందిస్తూ.. తాము ఈ విషయంపై ఇది వరకే తాలూకా విద్యాధికారికి, జిల్లా ఎడ్యుకేషన్ ఆఫీసర్కు సమాచారం ఇచ్చామని వివరించారు. అయితే, భావనకు వ్యతిరేకంగా తాము ఇచ్చిన కంప్లైంట్పై ప్రభుత్వం ఇది వరకు కూడా ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు.
గతేడాది జనవరిలో భావన పటేల్ ఈ స్కూల్కు వచ్చారని, ఈ ఏడాది నుంచి ఆమె అన్పెయిడ్ లీవ్స్ పైనే ఉన్నారని చెప్పినట్టు మీడియా కథనాలు వచ్చాయి. ఆ టీచర్కు షోకాజ్ నోటీసులు పంపారని, ఆమె పై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని అధికారులు కోరినట్టు తెలిసింది.