Internal Messages were hacked: తమ ఈ-మెయిల్స్ హ్యాకవుతున్నాయంటూ రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ప్రచార బృందం తాజాగా వెల్లడించింది. ఇది ఇరాన్ మద్దతున్న బృందాల పనేనంటూ ఆ బృందం ఆరోపించింది. తమకు సంబధించిన కీలక అంతర్గత సమాచారాన్ని తస్కరించి బహిర్గతం చేస్తున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
అంతేకాదు.. దీని వెనుక ఇరాన్ ప్రభుత్వ హస్తం ఉందని కచ్చితంగా చెప్పేలా తమ వద్ద పక్కా ఆధారాలను మాత్రం ట్రంప్ బృందం వెల్లడించలేదు. ఇదిలా ఉంటే అమెరికా ఎన్నికలు, ముఖ్యంగా ట్రంప్ ను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ సైబర్ దాడులకు పాల్పడుతోందంటూ టెక్ కంపెనీ మైక్రోసాఫ్ట్ ఆరోపించిన విషయం విధితమే. ఇది జరిగిన ఒక్క రోజు వ్యవధిలోనే ట్రంప్ ప్రచార బృందం ఈ విధంగా ప్రకటన వచ్చింది.
అయితే, ట్రంప్ వర్గాల ఆరోపణలపై అమెరికా విదేశాంగ శాఖ స్పందించింది. తమ దేశ ఎన్నికల్లో విదేశీ జోక్యాన్ని ఏ మాత్రం సహించబోమంటూ ఘాటుగా హెచ్చరించింది. తమ ప్రజాస్వామ్య వ్యవస్థలను బలహీనపరిచేందుకు చేసే ఎలాంటి కార్యకలపాలైనా సహించేది లేదంటూ తేల్చి చెప్పింది. ఇటు ట్రంప్ వర్గాల ఆరోపణలను ఐక్య రాజ్యసమితిలో ఇరాన్ రాయబార అధికారులు ఖండించారు. అమెరికా ఎన్నికల్లో జోక్యం చేసుకునే ఉద్దేశం తమకు ఏమాత్రం లేదని స్పష్టం చేసింది.
Also Read: ప్రభుత్వ పతనానికి అమెరికానే కారణం: షేక్ హసీనా
కాగా, అమెరికా ఎన్నికలను ప్రభావితం చేసే దిశగా ఇరాన్ ఆన్ లైన్ కార్యకలాపాలు పంజుకున్నట్లు మైక్రోసాఫ్ట్ శుక్రవారం ఓ నివేదికలో స్పష్టం చేసింది. ఎన్నికల ప్రచారాలే లక్ష్యంగా ఈ మెయిల్స్ ఫిషింగ్ లాంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నట్లు అందులో పేర్కొన్నది. పలు బృందాలు గతకొద్ది రోజులుగా దీనిపైనే వర్క్ చేస్తున్నాయని ఆరోపించింది. నకిలీ వార్తా వెబ్ సైట్లను సృష్టించి, సామాజిక కార్యకర్తల్లా అనుకరణ వంటి మార్గాల్లో ఓటర్ల మధ్య విభజన కోసం ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నది.