Shocking News: దేశంలోని ప్రాంతాలను బట్టి సంప్రదాయాలు, కట్టుబాట్లు పాటిస్తుంటారు. ఒక్కోక్కచోట ఒక్కో ఆచారాలు ఉంటాయి. కొన్ని చోట్ల జంతువులను దేవుళ్లుగా పూజిస్తే మరి కొన్ని చోట్ల మాత్రం జంతువులను చంపుకుని తింటుంటారు. అది ప్రాంతాలను బట్టి వారివారి కట్టుబాట్లుగా భావిస్తుంటారు. అయితే జంతువుల్లో ముఖ్యంగా పిల్లులు అంటే చాలా మంది భయపడుతుంటారు. మరికొంత మంది అయితే వాటిని ఇష్టపడుతుంటారు. సాధారణంగా హిందూ ఆచారాలు ప్రకారం పిల్లులు ఏదైనా పని మీద భయటికి వెళ్తున్నప్పుడు ఎదురుపడితే అపశకునం అని భావిస్తుంటారు. ముఖ్యంగా పిల్లుల్లో నల్ల పిల్లి కనిపిస్తే వణికిపోతుంటారు. ఏదో కీడు జరగబోతుందని, తిరిగి ఇంట్లోకి వెళ్లి కాసేపు కూర్చుని మళ్లీ వెళ్తుంటారు.
పిల్లి ఎదురుపడితే అశుభం అని భావించే మన ప్రాంతంలో కర్ణాటకలో మాత్రం పిల్లిని శుభ శకునం అని అంటున్నారు. ఈ ఘటన బెక్కళలే అనే గ్రామంలో వెలుగుచూసింది. ఏకంగా పిల్లులకు గుడి కట్టి మరి పూజిస్తున్నారు. అంతేకాదు గుడి కట్టి పిల్లుల కోసం జాతరను కూడా నిర్వహిస్తున్నారు. మరోవైపు ప్రతీ ఇంటిపైనా పిల్లి బొమ్మలు పెట్టుకుని ఇళ్లు నిర్మిస్తుంటారు. అంతేకాదు ఇంటి ఆవరణలో తిరిగే పిల్లులను పవిత్రంగా పూజిస్తుంటారు. అంతేకాదు ఇంట్లోకి వచ్చిన పిల్లుల్ని అస్సలు బయటకు తరమరు. అలా చేస్తే ఇంట్లోకి వచ్చిన అదృష్టాన్ని బయటకు తరిమినట్లే అని భావిస్తారు.
ప్రతీ ఇంట్లోని వారు వారి ఇంటి ముందు పాలు, పెరుగు, వెన్నను పెట్టి పిల్లుల ఆకలి తీరుస్తుంటారు. వాటికి నైవేద్యం పెట్టినట్లుగా భావిస్తుంటారు. అయితే ఇలా పిల్లులను పూజించే ఆచారం తమ గ్రామంలో వందల ఏళ్లుగా ఉందని చెబుతున్నారు. అంతేకాదు బెక్కళలేలో గ్రామదేవతగా మంగమ్మను పూజిస్తారు. అయితే మంగమ్మ తమ గ్రామంలోకి పిల్లి రూపంలో ప్రవేశించిందని నమ్ముతారు. అందువల్ల పిల్లిని బాధపెడితే తమ గ్రామదేవతను ఇబ్బంది పెట్టినట్లే అని భావిస్తారు.