Thungabhadra Dam Gate Washed Away : వేలాదిమంది రైతులకు జీవన ఆధారమైన తుంగభద్ర డ్యామ్ నుంచి 19వ క్రస్ట్ గేట్ చైన్ ఫెయిల్ అయింది. వరద ప్రవాహంలో డ్యామ్ గేటు కొట్టుకుపోవడంతో 65 టీఎంసీల నీరు వృథాగా పోతోంది. ఇప్పటికే 35 వేల క్యూసెక్కుల నీరు వృథాగా పోయింది. శనివారం రాత్రి 11 గంటలకు ఈ ఘటన జరగగా.. విషయం తెలిసిన నదీపరివాహక ప్రాంత ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. రాత్రంతా నిద్రలేకుండా జాగారం చేశారు. ఏ సమయంలో వరద ముంచెత్తుతుందోనని భయపడ్డారు.
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తుంగభద్ర డ్యామ్ కు భారీగా వరద నీరొచ్చి చేరుతోంది. డ్యామ్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 133 టీఎంసీలు కాగా.. 33 టీఎంసీలు సిల్ట్ తో నిండిపోయింది. ప్రస్తుతం 100 టీఎంసీల సామర్థ్యంతో ఉంది. 100 టీఎంసీల సామర్థ్యం వరదనీటితో నిండిపోవడంతో.. అధికారులు క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు.
Also Read: సాగర్లో డెడ్ స్టోరేజీ ఉన్నా నీటికొరత రాకూడదనే..! కేటీఆర్
అనూహ్యంగా శనివారం రాత్రి 19వ క్రస్ట్ గేట్ చైన్ తెగిపోవడంతో నది పరివాహక ప్రాంతంలోకి 35 వేల క్యూసెక్కులకు పైగా నీరు వృథాగా పోయింది. గేట్ చైన్ తెగిపోవడంతో వరదనీరు ముంచుకొస్తుందని తెలిసి.. సమీప గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తుంగభద్ర నీటిపారుదల శాఖ అధికారులు సైతం తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మంత్రి శివరాజ్, కొప్పళ ఎమ్మెల్యే రాఘవేంద్ర, నీటిపారుదలశాఖ నిపుణులు సంఘటనా స్థలాన్ని సందర్శించారు.
అయితే.. డ్యామ్ ప్రధాన గేటు గొలుసు దెబ్బతినడంతో.. ఇప్పుడు మరమ్మతులు చేయడం సాంకేతిక నిపుణులకు సవాలుగా మారింది. ఎమర్జెన్సీ గేట్లు లేకపోవడంతో అధికారులు నీటివృథాను అరికట్టలేకపోతున్నారు. డ్యామ్ నీటిమట్టం నుంచి 70 టీఎంసీలు ఖాళీ చేస్తే గానీ రిపేర్ చేసే పరిస్థితి లేదు. అదే జరిగితే 4 కర్ణాటకలో 4 జిల్లాలు తీవ్ర నీటికష్టాలను ఎదుర్కోక తప్పని పరిస్థితి. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. అప్పుడు కూడా డ్యామ్ గేట్ల మరమ్మతులు చేసేందుకు చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి.