AP cm Chandrababu naidu focus on Telangana tdp re development: 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవజ్ణుడు ..15 ఏళ్లు ప్రతిపక్ష నేతగా చేసిన అవిశ్రాంత యోధుడు. మొన్నటి ఎన్నికలలో వైఎస్ఆర్ సీపీని ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసి ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రిగా నాలుగోసారి పదవీ ప్రమాణం చేసి పాలనలో తన సత్తా చాటుతున్నారు చంద్రబాబు. గత కొంత కాలంగా తెలుగుదేశం పార్టీ విషయంలో ఏపీపైనే ఎక్కువగా దృష్టి సారించడంతో తెలంగాణ ప్రాంతంలో టీడీపీ తన ఉనికి కోల్పోయే ప్రమాదస్థితికి చేరుకుంది. ఈ మధ్య కాలంలో జరిగిన ఎన్నికలలో కూడా కేవలం నామమాత్రపు పోటీ తప్ప ఎక్కడా సరైన అభ్యర్థులనే నిలబెట్టలేదు.దాదాపు తెలుగుదేశం సీనియర్ నేతలంతా నాడు కేసీఆర్ పార్టీలోకి చేరిపోవడంతో తెలంగాణలో టీడీపీ దాదాపు ఖాళీ అయిపోయింది. అయితే ఏపీలో కూటమి సహకారంతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఇప్పుడు తెలంగాణలోనూ అదే ఫార్ములాను ప్రయోగించనున్నట్లు తెలుస్తోంది.
కార్యకర్తలతో భేటీ
తెలంగాణ పర్యటనలో భాగంగా తెలుగుదేశం శ్రేణులతో బంజారా హిల్స్ పార్టీ కార్యాలయంలో భేటీ అయ్యారు చంద్రబాబు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ తెలంగాణలో కొన్ని కారణాంతరాల వల్ల ఎన్నికలలో పోటీ చేయలేదని అన్నారు. తనకి తెలంగాణపై ఎటువంటి వ్యతిరేకత లేదని..తాను తెలంగాణకు వ్యతిరేకమని చాలా మంది చెప్పిన మాటలు నమ్మవద్దని అన్నారు. త్వరలోనే తెలంగాణలోనూ టీడీపీకి పునర్వైభవం వస్తుందని భరోసా ఇచ్చారు. ఇకపై తెలంగాణలో పార్టీ కార్యక్రమాలు చురుకుగా కొనసాగుతాయని అన్నారు. ఇప్పటికీ గ్రామీణ స్థాయిలో మంచి క్యాడర్ ఉన్న పార్టీ తెలుగుదేశమేనని అన్నారు. ప్రస్తుతం తెలంగాణలో ఛరిష్మా ఉన్న నేతను పార్టీ అధ్యక్షుడిగా నియమించబోతున్నానని చెప్పారు. అది కూడా అందరి ఆమోదంతో మాత్రమే అన్నారు. తెలంగాణ సమస్యలపై మంచి అవగాహన ఉన్న నేతను అధ్యక్షుడిగా నియమించబోతున్నట్లు తెలిపారు. క్షేత్ర స్థాయిలో గ్రామీణ ప్రాంతాలలో పార్టీ బలోపేతం గురించి కార్యకర్తలు కృషి చేయాలని అన్నారు. త్వరలోనే పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా చేపట్టి, కార్యకర్తలను కార్మోన్ముఖులు చేద్దామని అనుకుంటున్నట్లు తెలిపారు.
స్థానిక ఎన్నికలలోగా బలోపేతం
రాబోయే స్థానిక ఎన్నికలలోపు తెలంగాణలో పార్టీని బలోపేతం చేసే దిశగా ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. అలాగే కొత్తవారు గానీ పాతవారు గానీ తెలుగుదేశం పార్టీలో చేరడానికి ఎలాంటి అభ్యంతరం లేదని అన్నారు. తనకు నాయకులు కాదు ముఖ్యం అని..పార్టీ కోసం అహర్నిశలూ కష్టపడే క్యాడర్ ముఖ్యం అన్నారు. వ్యక్తులు వస్తుంటారు వెళుతుంటారు కానీ పార్టీ సిద్ధాంతాలు మాత్రం మారవని అన్నారు.గతంలో తెలుగుదేశం పార్టీ అద్భుత విజయాలను చవిచూసింది. అలాగే అపజయాలు కూడా ఎదుర్కొంది. కష్టసమయంలో కార్యకర్తలే అండగా నిలబడుతూ వచ్చారు. ఇప్పుడు కూడా వారిపైనే నమ్మకం ఉంది. మళ్లీ పార్టీకి పునర్వైభవం తీసుకురావడంలో వారే కీలకంగా నిలబడతారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ నుంచి వలసలు
ప్రస్తుతం బీఆర్ఎస్ పీకల్లోతు కష్టాలలో ఉంది. పార్టీని వీడేవారే తప్ప చేరేవారు ఎవరూ కనిపించడం లేదు. తెలుగు దేశం పార్టీ కనుక సిన్సియర్ గా తెలంగాణలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తే తప్పకుండా బీఆర్ఎస్ నుంచి టీడీపీకి వలసలు ప్రారంభమవుతాయని పార్టీ నేతలు చంద్రబాబుకు సూచించినట్లు తెలుస్తోంది.