Deputy CM Bhatti Vikramarka: రాఖీ పండుగవేళ ఉద్యోగులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శుభవార్త చెప్పారు. వారి సమస్యలను పరిష్కరించేందుకు తాను ఎప్పుడూ అందుబాటులో ఉంటాన్నారు. ప్రజాభవన్ లో థర్మల్, హైడ్రల్ విద్యుత్ ఉత్పాదనకు సంబంధించి ఆ శాఖల ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పలు సూచనలు చేశారు. వర్షాలను దృష్టిలో పెట్టుకుని జల విద్యుత్ కేంద్రాల్లో గరిష్ఠ ఉత్పత్తిని సాధించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. థర్మల్ పవర్ ప్రాజెక్టులకు సంబంధించిన ప్రతి ప్లాంట్ లోనూ కనీసం 17 రోజుల విద్యుత్ ఉత్పాదనకు సరిపోయేలా బొగ్గు నిల్వలు ఉండాలని సూచించారు. విద్యుత్ శాఖ అంటేనే 24/7 పనిచేసే అత్యవసర శాఖ అని అధికారులు, సిబ్బంది గుర్తుంచుకోవాలన్నారు. పూర్తిగా సేవా దృక్పథంతో కూడిన బాధ్యతల్లో ఉన్నామని సిబ్బంది గుర్తించాలని ఆయన పేర్కొన్నారు.
Also Read: బీజేపీ రాష్ట్ర అధ్యక్ష మార్పుపై బండి సంజయ్ కామెంట్స్.. ‘నాకు అభ్యంతరం లేదు’
ఉద్యోగులు ఎవరికైనా సమస్యలు ఉంటే వినేందుకు, వాటిని పరిష్కరించేందుకు 24 గంటల పాటు తాను అందుబాటులో ఉంటానంటూ డిప్యూటీ సీఎం భరోసా ఇచ్చారు. విద్యుత్ ఉత్పాదనలో ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు. నిర్దేశిత లక్ష్యాలను సాధించేందుకు అనుగుణంగా సమగ్ర ప్రణాళికను సిద్ధం చేసుకుని ముందుకు వెళ్లాలని ఆయన ఆదేశించారు. సకాలంలో నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల గతంలో శ్రీశైలం, జూరాల వంటి హైడ్రల్ విద్యుత్ ప్రాజెక్టులలో పలు సాంకేతిక సమస్యలు తలెత్తాయని, ఈ కారణంగా ఆ సమయంలో నష్టం వచ్చిందన్నారు. ఇప్పుడు నిర్ణయాలు తీసుకోవడంలో అలాంటి పరిస్థితి ఉండకూడదంటూ ఆయన అధికారులకు సూచించారు. వారానికి ఒకసారి విద్యుత్ కేంద్రాల పరిస్థితి, ఉత్పాదనకు సంబంధించిన నివేదికలు తనకు పంపాలన్నారు.