Mallareddy agricultural university student died..students fire on management: మాజీ మంత్రి మల్లారెడ్డికి చెందిన అగ్రికల్చర్ యూనివర్సిటీ విద్యార్థులు శనివారం ఆందోళన బాట పట్టారు. సురారం వద్ద ఉన్న మైసమ్మ గుడి ప్రాంతంలో నెలకొల్పిన అగ్రికల్చర్ యూనివర్సిటీ లో శుక్రవారం అరుణ్ అనే విద్యార్థి మృతి చెందాడు. అతని మృతి అనుమానాస్పదంగా భావించిన విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టాయి. చనిపోయిన విద్యార్థి బంధువులు కూడా అక్కడికి చేరుకున్నారు. ఆత్మహత్య చేసుకునేటంత పిరికివాడు కాడు మా అరుణ్ అంటూ మృతుడు తాలుకు బంధువులు ఆగ్రహావేశాలతో కళాశాల అద్దాల భవనాలపై రాళ్లతో దాడిచేశారు. విద్యార్థులంతా తరగతులు బహిష్కరించి రోడ్డుపై ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. వీళ్ల ఆందోళనలతో ఆ ప్రాంతమంతా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
విద్యార్థి సంఘాల మద్దతు
ఏబీవీపీ, ఎన్ఎస్ యుఐ, ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ వంటి విద్యార్థి సంఘాల నేతలంతా అక్కడికి చేరుకున్నారు. స్థానిక కాలేజీ విద్యార్థులంతా విద్యార్థి సంఘాల నేతలతో కలిసి యాజమాన్యంకు వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు. దీనిపై కళాశాల యాజమాన్యం దర్యాప్తు జరిపించాల్సిందిగా పట్టుబట్టారు. ఈ సందర్భంగా జరిగిన నిరసన కార్యక్రమాలతో కళాశాల అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం అయ్యాయి. కాగా విద్యార్థ సంఘాల ఆందోళనలకు ఇంతవరకూ కళాశాల తరపున ఏ ఒక్కరూ స్పందించలేదు. దీనితో విద్యార్థులు మరింత ఆగ్రహోదగ్ధులయ్యారు. పరిస్థితి అదుపుతప్పేలా ఉందని కళాశాల సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పేట్ బషీర్ బాద్ పోలీసులు ఆందోళన కారులను అడ్డుకున్నారు. పలువురు విద్యార్థి సంఘాల నేతలను అదుపులోకి తీసుకున్నారు. కళాశాల వద్ద మాత్రం ఘర్షణ పూరిత వాతావరణం నెలకొంది. ఏ క్షణాన ఏమవుతుందో అని స్థానిక ప్రజలు ఆందోళనలో ఉన్నారు.
అంబులెన్స్ ఆలస్యం
బీఎస్సీ అగ్రికల్చర్ ప్రధమ ఇంటర్ చదువుతున్న అరుణ్ కుమార్ శుక్రవారం సడన్ గా క్లాస్ రూమ్ లో స్పృహతప్పి పడిపోయాడు. ఆసుపత్రికి తరలించేలోపే అతడు మృతి చెందాడని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. పైగా అంబులెన్స్ కూడా సకాలంలో అక్కడికి చేరుకోలేదు. దీనితో అతడు మృతి చెందాడని చెబుతున్నారు. మల్లారెడ్డి కి చెందిన ప్రైవేటు వాహనాలు చాలానే ఉన్నాయి. పైగా కళాశాల బస్సులు కూడా ఉన్నాయి. ఇన్ని ఉన్నప్పటికీ ఆలస్యం అయినా అంబులెన్స్ లోనే తరలించడం పలు అనుమానాలకు తావిస్తోంది అని విద్యార్థి తాలుకు బంధువులు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. పోస్టుమార్టం రిపోర్టు తర్వాతే మృతి తాలుకు వివరాలు తెలుస్తాయని అంటున్నారు.