ఏపీ లో సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలైన వైసీపీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ప్రధానంగా జిల్లా కేంద్రమైన ఏలూరు నియోజకవర్గంలో వైసీపీలో ఒక్కో నేత వరుసగా ఆ పార్టీకి గుడ్ బై చెప్పేస్తుండడంతో ఇప్పుడు ఏలూరు వైసీపీ ఖాళీ అయిపోతుందా.? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల ముందే మాజీ ఇడా ఛైర్మన్ ఎమ్మార్డీ ఈశ్వరీ, బలరాం దంపతులు వైసీపీ కి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరారు. ఆ తర్వాత కార్పొరేటర్లు పప్పు ఉమా మహేశ్వరరావు, భీమవరపు హేమసుందరీలు కూడా వైసీపీ నుంచి టీడీపీలోకి జంప్ అయ్యారు.
వైసీపీ పుట్టినప్పడినుండీ ఆ పార్టీ జెండా మోసిన ఏలూరు వైసీపీ కీలక నేత, నగర వైసీపీ అధ్యక్షుడు బొద్దాని శ్రీనివాస్ కూడా వైసీపీ కి రాజీనామా చేయడంతో ఏలూరు రాజకీయాల్లో పెద్ద కలకలమే రేపింది. ఇప్పుడు తాజాగా ఏలూరులో జిల్లా వైసీపీ అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ అలియాస్ ఆళ్ల నాని పార్టీని వీడడంతో ఇక ఆ పార్టీలో ఎవరూ మిగలరన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. వాస్తవానికి ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత ఆళ్ల నాని ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఎలాంటి కార్యక్రమాల్లోనూ పాల్గొనడం లేదు. దాంతోఆళ్ల నాని తన పార్టీ పదవులకు రాజీనామా చేస్తారని ఊహాగానాలు మొదలయ్యాయి
జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తారని కొందరు, ఏలూరు అసెంబ్లీ ఇన్ ఛార్జ్ గా కూడా రాజీనామా చేస్తారని మరికొందరు గుసగుసలాడుకున్నారు. వీటన్నిటిని నిజం చేస్తూ ఏలూరు జిల్లా అధ్యక్షుడు పదవికి ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి పదవితో పాటు పార్టీకి కూడా రాజీనామా చేస్తున్నట్లు ఆయన జగన్కు లేఖ పంపించేశారు. దాంతో ఇంతకాలం పదవులు అనుభవించి, పార్టీ ఉనికి కాపాడాల్సిన టైంలో రాజీనామాచేయడం ఎంతవరకూ కరెక్ట్ అంటూ వైసీపీ కార్యకర్తలు విమర్శిస్తున్నారు.
Also Read: లోగుట్టు బయటపెట్టిన దువ్వాడ శ్రీను, జగన్.. బ్లాక్ మెయిల్ చేసింది వాణి
అయితే, ఆళ్ల నాని ముందు నోరు విప్పే సాహసం జిల్లాలోని వైసీపీ నాయకులు ఎవరూ చేయలేకపోతున్నారు. ఇప్పటికే కూటమి సర్కారు నుండి ఒత్తిళ్లను ఎదుర్కొనేందుకు పలువురు పార్టీ నేతలు ఆళ్ల నాని అండ కోరుతున్నారంట. అయితే, ఓటమి తర్వాత సైలెంట్ గా ఉన్న ఆళ్ల నాని, పార్టీ నాయకులతో మీ ఇష్టం, మీరు పార్టీలో ఉంటే ఉండండి, లేకుంటే లేదంటూ చేతులెత్తేశారంట.. ఇప్పుడు ఆయన కూడా పార్టీకి గుడ్బై చెప్పడంతో పార్టీ నేతలు, స్థానికసంస్థల ప్రజాప్రతినిధులు తమ రాజకీయ భవితవ్యంపై అత్యవసర సమావేశాలు పెట్టుకుంటున్నారంట.
ఏలూరు నగర మేయర్ షేక్ నూర్జహాన్, ఆమె భర్త, కోఆప్షన్ సభ్యుడు ఎస్ఎమ్ఆర్ పెదబాబు లు ప్రస్తుతానికి ఏలూరు వైసీపీలో కీలక నేతలుగా ఉన్నారు. అయితే, వారు పుట్టిల్లు తెలుగుదేశం పార్టీయే అయినా, 2019 ఎన్నికల ముందు అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే బడేటి బుజ్జితో ఏర్పడ్డ విబేధాలతో టీడీపీని వీడి, వైసీపీలో చేరి, 2019 ఎన్నికల్లో ఏలూరు వైసీపీ ఎమ్మెల్యే గా ఆళ్ల నాని గెలుపుకు దోహదపడ్డారు. అయితే ఆళ్ల నాని మోనోపోలీ రాజకీయాలు చేస్తుండటంతో విమర్శించే ధైర్యం లేకపోయినా, 2024 ఎన్నికల సమయానికి మాత్రం కొందరు కీలక నేతలు ఆయనకు హ్యాండ్ ఇచ్చారంట.
అలా ఆళ్ల నానికి సహకరించని వారిలో నగర మేయర్ నూర్జహాన్ దంపతులు కూడా ఉన్నారంట. అయితే, సార్వత్రిక ఎన్నికల్లో వారు వైసీపీని వీవీడకపోయినా, పరోక్షంగా తెలుగుదేశం అభ్యర్ధి బడేటి చంటికి మద్దతుగా పనిచేశారంటున్నారు. ఇక ఎన్నికల్లో టీడీపీ గెలుపు సాధించడంతో మేయర్ దంపతులు స్వయంగా ఎమ్మెల్యే బడేటి చంటి కార్యాలయానికి వెళ్లి, శుభాకాంక్షలు చెప్పి వచ్చారు. ఇక ఆళ్ల నాని వైసీపీ నుంచి ఎగ్జిట్ అవ్వడంతో.. మేయర్ తో పాటు ఇతర వైసీపీ కార్పొరేటర్లు పసుపు కండువా కప్పుకోవడం లాంఛనమే అంటున్నారు.