Rahul Gandhi on BJP in Lok Sabha(Political news telugu): ఒకప్పుడు ఆయనను కూరలో కరేపాకు మాదిరిగా ఏరిపారేసేవారు. పదేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతల దృష్టిలో ఆయన ఒక జోకర్. రాజకీయాలు ఏమీ తెలియని అమాయకుడు. పప్పు ఇలా రకరకాల కామెంట్స్ తో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీని ఓ ఆట ఆరేసుకున్నారు. ఇప్పుడు ఆ పప్పే నిప్పులా మారిపోయారు. రాహుల్ కు దగ్గరగా వస్తే ఆ నిప్పులో ఎక్కడ కాలిపోతామో అని భయపడి దూరంగా పారిపోతున్నారు బీజేపీ శ్రేణులు. పార్లమెంట్ లో మాట్లాడటమే రాదనుకున్న రాహుల్ గాంధీ ఇప్పుడు రాటుదేలిపోయారు. నిర్మొహమాటంగా కేంద్రాన్ని నిలదీయడంలో వెనకాడటం లేదు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలలోనూ బీజీపీని ఎండగట్టడంలో ..ప్రతిపక్ష నేతగా తనకు ఇచ్చిన బాధ్యతను నెరవేర్చడంలో తనేమిటో..తన సత్తా ఏమిటో చూపిస్తున్నారు రాహుల్ గాంధీ.
పవర్ ఫుల్ ప్రతిపక్ష నేతగా..
రెండు పర్యాయాలుగా బీజేపీకి ఎదురే లేకుండా పోయింది. అందుకే అప్పట్లో వాళ్లకు ప్రతిపక్ష నేతలంటే జోకర్ల మాదిరిగా కనిపించారు. పైగా అప్పట్లో రాహుల్ మాట్లాడిన ప్రతి మాటనూ కామెడీ సెన్స్ తో తీసుకున్న బీజేపీ రాహుల్ వ్యాఖ్యలపై విపరీతంగా ట్రోలింగులు చేసేవారు. మొన్నటికి మొన్న బడ్జెట్ సమావేశాలలో రాహుల్ గాంధీ బీజేపీ విధానాలను ఎండగట్టిన విధానం తీరు చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. కొన్ని సందర్భాలలో అమిత్ షా వంటి నేతలు కూడా అసహనానికి గురవ్వడం కనిపించింది. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా రాహుల్ ప్రశ్నలకు ఉక్కిరిబిక్కిరయ్యారు. తలపై చేతులు పెట్టుకుని కనిపించారు. పార్లమెంట్ లో రాహుల్ తన మాటలను తూటాల మాదిరిగా పేలుస్తుంటే యావత్ దేశం మొత్తం గమనించింది.
పరిణితి కలిగిన నేతగా ..
ఇన్నాళ్లూ ఎదురనేది లేకుండాపోయిన మోదీకి రాహుల్ గాంధీ పక్కలో బల్లెం మాదిరిగా తయారయ్యారు. పార్లమెంట్ లో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ మాట్లాడటానికి పైకి లేస్తుంటే బీజేపీ ఎంపీలు రాహుల్ గాంధీని నిలువరించేందుకు ప్రయత్నిస్తున్న దృశ్యాలు కనిపించాయి. అయినా అవేమీ పట్టించుకోకుండా రాహుల్ గాంధీ ఆత్మ విశ్వాసంతో వారిని ఎదుర్కొన్న తీరు సర్వత్రా ప్రసంశలు అందుకుంటోంది. ఎన్టీయే కూటమి కూడా ఇప్పుడిప్పుడే రాహుల్ గాంధీలో పరిణితి కలిగిన రాజకీయ నేతను చూస్తున్నామనే ఫీలింగ్ కలుగుతోందని బాహాటంగానే కామెంట్స్ చేయడం కనిపించింది. యావత్ దేశం మొత్తం కొత్త నేతను భావి ప్రధానిగా చూడాలని అనుకుంటున్నారనే సంకేతాలు కనిపిస్తున్నాయి.
స్వేచ్ఛను కోల్పోయిన బీజేపీ
బీజేపీ కూడా స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశం లేక అల్లాడిపోతోంది. నీట్ వ్యవహారంై నిలదీసిన రాహుల్ మణిపూర్ అంశాన్నీ వదలలేదు. ఇటీవల జరిగిన వయనాడ్ సంఘటనలోనూ బీజేపీనే ద్రోహిగా నిలబెట్టే ప్రయత్నం చేశారు. ఇప్పుడు రాహుల్ గాంధీ ఎఫెక్టుతో మోదీ వయనాడ్ పర్యటించాల్సి వచ్చింది. బీజేపీ రాహుల్ గాంధీని ఎంతగా కంట్రోల్ చేద్దామంటే అంతకు మించి రెట్టింపు బలంతో రాహుల్ బలపడుతున్నారు. ఒకప్పుడు రాహుల్ గాంధీని తక్కువ చేసి మాట్లాడిన ఇండియాకూటమి కి ఇప్పుడు రాహుల్ గాంధీ ఓ ఆశా కిరణంగా కనిపిస్తున్నారు. మోదీ అండ్ కో కు మాత్రం రాహుల్ గాంధీ విజృంభణతో సహనం కోల్పోతున్నారు. ఈ గందరగోళంలో మరిన్ని తప్పులు చేసేసి ప్రజలలో చులకన అవుతున్నారు.