Non Veg Food Ban In School| ఒక ప్రైవేట్ స్కూల్ యజమాన్యం అక్కడ చదువుకునే పిల్లలందరూ లంచ్ బాక్స్ లో శాఖాహార భోజనం మాత్రమే తీసుకురావాలని సర్కులర్ జారీ చేసింది. విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల కోసం ఎటువంటి మాంసాహార భోజనం లంచ్ బాక్స్ లో ప్యాక్ చేసి స్కూల్ కు పంపవద్దని చెప్పింది. ప్రైవేట్ స్కూల్ జారీ చేసిన ఈ సర్కులర్ ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. కొందరు పిల్లల తల్లిదండ్రులు ఈ సర్కులర్ వివిక్ష పూరితంగా ఉందని వాదిస్తుంటే.. మరికొందరు ఇలా చేయడమే కరెక్ట్ అని చెబుతున్నారు.
వివరాల్లోకి వెళితే.. దేశ రాజధాని ఢిల్లీలోని నోయిడా సెక్టర్ 132 పరిధిలో ఉన్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్ మేనేజ్ మెంట్ గురువారం ఓ సర్కులర్ జారీ చేసింది. ఆ సర్కులర్ ప్రకారం.. తల్లిదండ్రులు తమ పిల్లలకు స్కూలకు పంపించే మధ్యాహ్న భోజనంలో కేవలం శాఖాహార భోజనం మాత్రమే ఉండాలని. ఎటువంటి మాంసాహార పదార్థాలు పంపవద్దని.. ఇలా చేయడం వల్ల పిల్లల్లో సమాన తత్వ భావాలు పెరుగుతాయని, ఒకరిపట్ల మరొకరి గౌరవభావం కలుగుతుందని ఉంది.
కానీ స్కూల్ జారీ చేసిన సర్కులర్ వివక్షపూరితంగా ఉందని కొందరు తల్లిదండ్రులు దీనిని వ్యతిరేకిస్తున్నారు. ”మా పిల్లలు ఏం తినాలో కూడా స్కూల్ యజమాన్యమే నిర్ణయిస్తుందా?.. పిల్లలకు పౌష్టికాహారం ఇచ్చే హక్కు వాళ్ల కన్నవాళ్లకు లేదా?,” అని ఘూటాగా ప్రశ్నిస్తున్నారు.
Also Read: ‘ఉద్యోగం కావాలంటే బాస్ తో సమయం గడపాలి’.. మహిళకు కండిషన్ పెట్టిన మేనేజర్
మరోవైపు స్కూల్ నిర్ణయాన్ని కొంతమంది తల్లిదండ్రులు సమర్థిస్తున్నారు. ”పిల్లలకు నాన్ వెజ్ తినిపించాలంటే ఇంట్లో తినిపించండి. స్కూల్ లో మిగతా పిల్లల ముందు వారికి మాంసాహారం పెట్టాల్సిన అవసరమేముంది. స్కూల్ తీసుకున్న నిర్ణయం కరెక్టే.” అని కిరణ్ డవే అనే పేరెంట్ వాదించారు. మరో పేరెంట్ ట్విట్టర్ ఎక్స్ లో స్కూల్ సర్కులర్ పై పోస్ట్ చేశారు. “స్కూల్ ని ఒక హోటల్, రెస్టారెంట్ లాగా భావించకూడదు. నాన్ వెజ్ తినాలనుకునే వారు ఇంటి వద్ద తినొచ్చు. స్కూల్ టిఫిన్ బాక్సులో తీసుకురావడం అవసరమా?.. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నాన్ వెజ్ ఫుడ్ బ్యాన్ ని స్కూల్ టిఫిన్స్ లో బ్యాన్ చేయడం సరైన నిర్ణయమే. మేము చిన్నప్పుడు కూడా స్కూల్ నియమాలను పాటించాం. ఇదేం వివక్ష కాదు. మెజారిటీ అందరూ వెజ్ మీల్స్ మాత్రమే ఇస్తున్నారు. తోటి పిల్లల ఫీలింగ్స్ ను గౌరవించాలి. నాన్ వెజ్ బ్యాచ్ వ్యర్థం వాదన ఆపాలి,” అని రాశాడు.
Also Read: తినడానికి తిండి లేదు.. తండ్రి కూలీ.. కట్ చేస్తే ఇప్పుడు ఒలింపిక్ హీరో
ఈ వివాదం ముదరడంతో స్కూల్ డిసిప్లిన్ కమిటీకి తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా.. ప్రభుత్వ విద్యా శాఖలో ఫిర్యాదు చేయమని సూచించారు. కానీ చివర్లో స్కూల్ ప్రిన్సిపాల్ సుప్రీత్ చౌహాన్ స్పందించారు. ”మేము జారీ చేసిన సర్కులర్ ని కొందరు అపార్థం చేశారు. పిల్లల లంచ్ బాక్స్ లో నాన్ వెజ్ పంపవద్దని చెప్పిన మాట వాస్తవమే. కానీ అది తప్పని సరి కాదు. కేవలం తల్లిదండ్రులను మా విజ్ఞప్తి మాత్రమే. దీనికి కారణాలు కూడా సర్కులర్ లో వివరించడం జరిగింది. ఉదయం వండిన మాంసాహారం.. బాక్సులో గంటల తరబడి మూసి ఉండడం వలన అది ఆరోగ్యానికి మంచిది కాదు. పైగా కొందరు పిల్లలు శాఖాహార భోజనం చేస్తుండగా.. మరికొందరు మాంసాహారం తినడం వల్ల వారిలో సమానత్వ భావాలు లోపిస్తాయి.” అని ఆమె వివరణ ఇచ్చారు.
Also Read: ‘కలియుగం.. ఆడవాళ్లు ఇలా కూడా చేస్తున్నారు’.. పాకిస్తాన్ లో డివోర్స్ పార్టీపై ట్రోలింగ్