Cabinet sanctions 8 new line projects for Railways worth Rs 25 thousand crores: భారత దేశానికే తలమానికంగా నిలచిన రైల్వే వ్యవస్థ మరింత బలోపేతం కానుంది భవిష్యత్తులో. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆ ఎనిమిది భారీ ప్రాజెక్టులు పూర్తయితే దాదాపు రెండు వందల అరవై ఏడు కోట్ల కిలోల మేరకు కర్భన ఉద్గారాల విడుదల తగ్గిపోతుంది.వాతావరణంలో భారీ తరహాలో మార్పులు చోటుచేసుకోనున్నాయి. వాయుకాలుష్యం కూడా గణనీయంగా తగ్గిపోనుంది. ఆ దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. ఈ ప్రక్రియలో భాగంగానే తెలుగు రాష్ట్రాలతో సహా మిగిలిన రాష్ట్రాలకు ప్రయోజనం చేకూరేలా ఇరవై నాలుగు కోట్ల ఆరువందల యాభై ఏడు కోట్ల ప్రాధమిక అంచనాతో ఎనిమిది కీలక రైల్వే ప్రాజెక్టులకు సెంట్రల్ ఫైనాన్షియల్ క్యాబినెట్ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.
తెలుగు రాష్ట్రాలకు..
తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలం, ఏపీలోని పాండురంగాపురం కూడా వీటి పరిధిలోకే వస్తాయి. ఎక్కువగా గిరిజనులకు ఉపయోగపడేలా ఈ మార్గాలను రూపొందించడం విశేషం. కొండ ప్రాంతాలలో కనెక్టివిటీ ఉండేలా.. ప్రత్యేకించి ఆ ప్రాంతాలలో నివాసితులై ఉంటున్న అటవీ ప్రాంతానికి చెందిన గిరిజనులకు ఈ రైల్వే ప్రాజెక్టులు అత్యంత ఉపయోగకరంగా ఉండనున్నాయి. తాజాగా మంజూరు చేసిన రైల్వే లైనులలో భాగంగా నవరంగాపూర్-జేపోర్-మల్కాన్ గిరి రూట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇది దాదాపు 170 కిలోమిటర్లు ఉండే రైల్వే లైను. దీనికి అదనంగా భద్రాచలం-పాండురంగాపురం లైన్ కనెక్టివిటీ ఇచ్చారు. ఇప్పుడు కొత్తగా శాంక్షన్ అయిన ఈ లైన్ ద్వారా భద్రాచలం కొత్తగూడెం, తూర్పుగోదావరి ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని కేంద్రం భావిస్తోంది. ఇందుకోసం లక్ష్యంగా వెయ్యి ఆరువందల హెక్టార్ల భూమిని సమీకరించాలని భావిస్తున్నారు.
భారత ఆర్థిక వ్యవస్థలో నూతన శకం
కొత్తగా మంజూరయిన ఈ ఎనిమిది భారీ రైల్వే ప్రాజెక్టులు పూర్తయితే భారత ఆర్థిక వ్యవస్థలో నూతన శకం ఆరంభమైనట్లే అని కేంద్రం భావిస్తోంది. గిరిజనుల ఉత్పత్తులు ఇకపై దేశం నలుమూలలా సరఫరా అవుతాయి. దానితో ఆర్థికంగా ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. పూర్తిగా ప్రకృతి పచ్చని చెట్ల మధ్య నుంచి రైల్వే లైన్లు ఏర్పాటు చేయడం వలన పర్యావరణంగా కూడా ఆహ్లాదకర వాతావరణం నెలకొంటోంది. ఈ రైల్వే లైన్లు దాదాపు ఏడు రాష్ట్రాలకు చెందిన 14 జిల్లాలను కలపనున్నాయి. ఇక కొత్తగా అరవై నాలుగు రైల్వే స్టేషన్లు కూడా నిర్మాణం జరగనున్నాయి.