Gutha Sukender Reddy Comments(Telangana news today): నాగార్జునసాగర్ ప్రాజెక్టు సమీపంలోని సుంకిశాల ప్రాజెక్టును శుక్రవారం తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సందర్శించారు. నాగార్జున సాగర్ వరద ప్రవాహం ఎక్కువగా రావడంతో కూలిపోయిన సుంకిశాల సైడ్ వాల్ ప్రదేశాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘గోదావరి నదిపై ప్రాజెక్టుల నిర్మాణం జరిగినంత వేగంగా కృష్ణా నదిపై ప్రాజెక్టుల పనులు జరగలేదు. సుంకిశాల ప్రాజెక్టు ఎందుకు ప్రారంభించారో కేసీఆర్, కేటీఆర్ కే తెలియాలి. హైదరాబాద్ జంట నగరాలకు తాగునీరు అందించేందుకు సుంకిశాల ప్రాజెక్టు అవసరం లేదు. ఇది కేసీఆర్ మానస పుత్రికనో లేక కేటీఆర్ మానస పుత్రికనో అర్థం కావడం లేదు. కేటీఆర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన రాజకీయ విమర్శలు చేయడం సరికాదు. గత ప్రభుత్వ హయాంలోనే సుంకిశాల ప్రాజెక్టుకి శంకుస్థాపన చేశారు. కాంట్రాక్టర్లను ఎంపిక చేసి, పనులు చేపించింది కూడా గత ప్రభుత్వమే. నేటి ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు. జరిగిన నష్టాన్ని మొత్తం కాంట్రాక్టరే భరించి, ప్రాజెక్టుని పూర్తి చేయాలి. అనవసరమైన రాజకీయ విమర్శలు చేసుకోవడం కరెక్ట్ కాదు’ అంటూ ఆయన పేర్కొన్నారు.
Also Read: అధికారి ఇంట్లో నోట్ల కట్టలు.. చూసి కంగు తిన్న అధికారులు
అనంతరం మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. ‘జరిగిన సంఘటన చిన్నది.. నష్టం కూడా తక్కువే. నష్టం కాంట్రాక్టర్ భరిస్తారు. ప్రజలకు, ప్రభుత్వానికి ఎలాంటి నష్టం లేదు. ప్రాజెక్టు పూర్తి కాలేదు. నిర్మాణంలో లేదు. నిర్మాణం పూర్తి కావడానికి ఒకటి, రెండు నెలలు నిర్మాణం ఆలస్యం అవుతుంది. గత ప్రభుత్వం ఎస్ఎల్ బీసీ పూర్తి చేయలేదు. ఎస్ఎల్ బీసీ ప్రాజెక్టు ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేస్తాం. డిండి ఎత్తిపోతల పథకం సైతం పూర్తి చేస్తాం. బీఆర్ఎస్ ఎందుకు విమర్శలు చేస్తున్నారో అర్థం కావడం లేదు. సుంకిశాల అన్ని పనులు బీఆర్ఎస్ హయంలోనే జరిగాయి. సోషల్ మీడియా ద్వారానే సుంకిశాల ప్రమాదం ప్రభుత్వానికి తెలిసింది. ఘటన జరగగానే ప్రభుత్వం స్పందించింది. హైదారాబాద్ వాటర్ వర్క్స్ వాళ్లు విచారణ చేస్తున్నారు. సీఎం అమెరికా నుంచి వచ్చిన తరువాత చర్చించి చర్యలు తీసుకుంటాం. బీఆర్ఎస్ వాళ్లు కాంగ్రెస్ ప్రభుత్వంపై అనవసర విమర్శలు చేస్తున్నారు. దక్షిణ తెలంగాణను బీఆర్ఎస్ నిర్లక్ష్యం చేసింది.
‘ఈ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తుంది. ఘటనపై ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారణ చేస్తాం. నష్టం అంతా నిర్మాణ సంస్థ భరిస్తుంది. ఘటనపై విచారం వ్యక్తం చేస్తున్నాం. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ పనులు పూర్తి చేయాలి’ అంటూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.