Nag Panchami 2024: శ్రావణమాసం పవిత్రమైన మాసం. ఈ మాసంలో శుక్లపక్షం ఐదవ రోజున నాగ పంచమిని జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున నాగ దేవతను పూజిస్తుంటారు. ఇదిలా ఉంటే నాగ పంచమి రోజు ఉత్తరప్రదేశ్లోని అన్ని ప్రాంతాల్లో గుడియా పండగను జరుపుకుంటారు. ఈ పండగ రోజు నాగదేవతను ఇక్కడి ప్రజలు పూజిస్తారు. సాయంత్రం అనేక చోట్ల బొమ్మలను కర్రలతో కొడతారు. సోదర సోదరీమణులు తయారు చేసిన బొమ్మలను అన్నదమ్ములు కర్రలతో కొడతారు. మరి ఈ బొమ్మలు కొట్టే సాంప్రదాయం వెనుక ఉన్న కారణమేంటి ? గుడియా పండగ సాంప్రదాయానికి సంబంధించిన మరిన్ని విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
బొమ్మలను ఎందుకు కొడతారు:
ఉత్తరప్రదేశ్లోని అనేక ప్రాంతాల్లో నాగపంచమి పండగను గుడియా అని కూడా పిలుస్తారు. ఈ పండగను జరుపుకోవడానికి అక్కాచెల్లెళ్లు బొమ్మలను తయారుచేస్తారు. అమ్మాయిలు పాత బట్టలతో బొమ్మలను తయారు చేసి కూడళ్లలో లేదా చెరువుల దగ్గర బొమ్మలను ఉంచుతారు. ఆ తర్వాత వారి యొక్క అన్నాతమ్ములు అక్కడ గుమిగూడి వాటిని కర్రలతో కొడతారు. వారు ఇలా చేయడానికి గల కారణం ఏమిటి..దీని వెనక ఉన్న జానపద కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
నాగదేవతకు సంబంధించిన జానపద కథ:
నాగపంచమి రోజు బొమ్మలు కొట్టే సాంప్రదాయానికి సంబంధించిన కథ ఒకటి ప్రచారంలో ఉంది. పురాతన కాలంలో మహాదేవ్ అనే బాలుడు నాగ దేవత యొక్క భక్తుడు. మహా దేవ్ ప్రతి రోజు ఏదో ఒక శివాలయానికి వెళ్లి శివునితో పాటు నాగదేవతను కూడా ప్రత్యేకంగా పూజించేవాడు. అతడి భక్తికి సంతోషించి నాగదేవుడు ప్రతి రోజు కనిపించేవాడు. ఆలయంలో అతడు చేస్తున్న పూజల సమయంలో పాములు చాలా సార్లు అతడికి హతుక్కునేవి. కానీ అతనికి ఎలాంటి హానీ జరగలేదని చెబుతుంటారు.
మహాదేవుడు ఒక రోజు శివాలయంలో నాగదేవుడిని పూజించడంలో నిమగ్నమై ఉండగా అక్కడికి వచ్చిన ఒక పాము అతడి పాదాలను చుట్టుకుంది. అదే సమయంలో అతడి సోదరి అక్కడికి చేరుకుని తమ్ముడి పాదాలకు పాము చుట్టుకోవడం చూసి భయపడిపోయింది. తన అన్నను పాము కాటేస్తుందేమోనని భయపడి కర్ర తీసుకుని పామును కొట్టి చంపింది. దీని తర్వాత మహదేవ్ తన ఏకాగ్రత కోల్పోయాడు. అతడు తన ముందు చనిపోయిన పామును చూసాడు.
Also Read: శ్రావణ శనివారం ఇలా చేశారంటే శని ఆశీస్సులు మీ వెంట ఉన్నట్లే..
తన సోదరి పామును చంపడంతో తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. దీనికి కారణం ఏమిటని అడగగా అసలు విషయం చెప్పింది. దీంతో మహదేవ్ తన సోదరితో నీకు తెలియకుండానే నాగదేవతను చంపేశావని అందుకు నీకు తప్పకుండా శిక్ష పడుతుందని చెప్పాడు. ఆ రోజు నుంచి ఆమె ప్రతి రూపంగా బొమ్మలను తయారు చేసిన ప్రతీకార శిక్షగా కొడుతున్నారు. అప్పటి నుంచి ఉత్తర ప్రదేశ్ లో ఈ నాగపంచమి రోజు బొమ్మలు కొట్టే సంప్రదాయం కొనసాగుతోంది.