Son Killed Mother in Medak District: చిన్న చిన్న విషయాలకే అయినవారిని పొట్టనపెట్టుకుంటున్నారు. జంతువులలో ఉన్నపాటి ఐకమత్యం మనుషుల్లో ఉండట్లేదు. మనస్ఫర్థలు, గొడవలు, ఆర్థిక ఇబ్బందులు, ఆస్తి తగాదాలు ప్రాణాలను హరిస్తున్నాయి. అంతేకాదు.. వయసు పైబడిన తల్లిదండ్రుల్ని బాధ్యతగా చూసుకోవాల్సిన పిల్లలే డబ్బు కోసం ప్రాణాలు తీసేస్తున్నారు.
మద్యానికి బానిసై కన్నతల్లినే హత్య చేసిన ఘటన మెదక్ జిల్లా నిజాంపేటలో చోటు చేసుకుంది. మద్యానికి బానిసైన కొడుకు రామచంద్రం.. అర్ధరాత్రి తల్లి దుర్గవ్వతో పెన్షన్ డబ్బులు ఇవ్వాలని గొడవపడ్డాడు. తన దగ్గర డబ్బులు లేవని దుర్గవ్వ ఎంత చెప్పినా వినని రామచంద్రం.. తల్లి గొంతు నులిమాడు. అనంతరం చున్నీతో ఉరివేసి హత్య చేశాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి కేసు నమోదు చేశారు. దుర్గవ్వ మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు.
కొడుకు బువ్వ పెట్టడంలేదంటూ ఓ వృద్ధురాలు పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. కొడుకు, కోడలు తనని పట్టించుకొవడంలేదని వాపోయింది. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది.
కొనాపూర్కి చెందిన మల్లవ్వ తన కొడుకు, కోడలు.. ఇద్దరు పిల్లలు ఉన్నారు. కట్టుకున్న భర్త చనిపోగా కొడుకు వద్దే ఉంటుంది మల్లవ్వ. తన పేరు మీద ఉన్న 60 కుంటల భూమిని కొడుకు వేరే అతని కౌలుకు ఇచ్చి ఆ డబ్బు తననే తీసుకుంటున్నాడు. కొడుకు తనని పట్టించుకోవడం లేదని, కౌలు పైసలు ఇవ్వకపోగా తినడానికి తిండి కూడా పెట్టడం లేదని ఎస్సై సందీప్ ని కలిసి ఫిర్యాదు చేసింది. కొడుకు, కోడల్ని పిలిచి న్యాయం చేస్తామని మల్లవ్వకి ఎస్సై చెప్పి పంపించారు.