Sri Satya Sai District : శ్రీ సత్యసాయి జిల్లాలో ఓడీసీ మండలంలో దారుణం చోటు చేసుకుంది. నాటు వైద్యం పేరుతో ఓ ఆర్ఎంపీ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాడు. టి.కుంట్లపల్లి, బసప్పగారి పల్లెల్లో విషాదం నెలకొంది. మోకాళ్ల నొప్పులు బాగుచేస్తానంటూ అంటూ ఓ ఆర్ఎంపీ వైద్యుడు ఇచ్చిన సూది మంది వికటించి ఇద్దరు మరణించారు. మరో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్న పలు గ్రామాలకు చెందిన 30 మంది.. అమడగూరు మండలం పూలకుంట్లపల్లిలో ఈనెల 3న చిత్తూరు జిల్లా వాయల్పాడుకు చెందిన ఓ ఆర్ఎంపీ వద్దకు వెళ్లారు. వీరందరికీ ఆర్ఎంపీ సూది మందు ఇచ్చాడు. సూది మందు తీసుకున్న రోజు నుంచి టి.కుంట్లపల్లికి చెందిన పప్పురమ్మ, ఓబులేసు, సాహెబ్ పీరాలకు మోకాళ్ల నొప్పులు అధికమయ్యాయి.
వీరితోపాటు బసప్పగారిపల్లికి చెందిన రామప్ప, ఉత్తన్నలకు మోకాళ్ల నొప్పులు పెరిగిపోయాయి. విపరీతంగా వాపులు రావడంతో తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. వీరిలో పప్పురమ్మ, రామప్పల పరిస్థితి విషమించి మరణించారు. ఓబులేసు, సాహెబ్ పీరా, ఉత్తన్నల పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. పప్పురమ్మ, రామప్ప మృతితో గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. బంధువుల ఆర్తనాదాలలు మిన్నంటాయి. ప్రభుత్వం ఆర్ఎంపీ వైద్యునిపై వెంటనే చర్యలు చేసుకోవాలని బాధితుల బంధువులు కోరుతున్నారు.