Lok Sabha: పార్లమెంటు సమావేశాలు వాడీవేడిగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో లోక్ సభలో కేంద్రమంత్రి అమిత్ షా, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ మధ్య మాటల యుద్ధం కొనసాగింది. దీంతో కొద్ది సేపు లోక్ సభలో ఆందోళన వాతావరణం ఏర్పడింది. స్పీకర్ హక్కులకు భంగం కలిగిస్తున్నారంటూ అఖిలేశ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారి తీశాయి.
అఖిలేశ్ మాట్లాడుతూ.. ‘లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా హక్కులతోపాటు ప్రతిపక్ష ఎంపీల హక్కులను కాలరాస్తున్నారు. అంతేకాదు.. స్పీకర్ హక్కులను లాక్కుంటున్నారు. మీ తరఫున మేం పోరాడేందుకు సిద్ధంగా ఉన్నాం’ అంటూ అఖిలేశ్ ప్రసంగించారు. దీనిపై స్పందించిన కేంద్రమంత్రి అమిత్ షా.. అఖిలేశ్ వ్యాఖ్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇది సభాపతిని అవమానించడమేనంటూ అమిత్ షా నిప్పులు చెరిగారు. స్పీకర్ హక్కులకు ప్రతిపక్షాలు పరిరక్షకులు కాదంటూ ఆయన మండిపడ్డారు.
Also Read: హసీనాకు పట్టిన గతే మోదీకి.. కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు
‘సభలో అఖిలేశ్ చేసిన వ్యాఖ్యలను నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఇది స్పీకర్ పదవిని పూర్తిగా అవమానించడమే అవుతుంది. ప్రతిపక్ష సభ్యులు స్పీకర్ హక్కుల పరిరక్షకులు కాదు.. మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేయకండి’ అంటూ అమిత్ షా ధ్వజమెత్తారు. అనంతరం ఇదే అంశానికి సంబంధించి స్పీకర్ ఓం బిర్లా స్పందించారు. స్పీకర్ ను ఉద్దేశించి సభ్యులెవరూ ఎటువంటి వ్యాఖ్యలు చేయకూడదంటూ సూచించారు.
ఇదిలా ఉంటే.. వక్ఫ్ చట్టం సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టింది. దీనిపై సభలో చర్చను ప్రారంభించిన విషయం తెలిసిందే.