AP Minister Nadendla: ఏపీకి లక్ష టన్నుల కందిపప్పు ఇవ్వాలంటూ కేంద్రాన్ని కోరినట్లు రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఢిల్లీలో కేంద్రమంత్రిని కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి రేషన్ కార్డుల విషయంలో కేంద్రం అనుసరించే ఎన్ఎఫ్ఎస్ఏ ప్రకారం ఆంధ్రప్రదేశ్ కు తీవ్ర అన్యాయం జరిగింది. విభజన జరిగినప్పుడు జనాభా ప్రాతిపదికన కాకుండా, 2001 సెన్సెస్ ప్రకారం కేంద్రం కేటాయించింది. దీంతో రాష్ట్రానికి రేషన్ కార్డులు భారీగా తగ్గాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 1.47 కోట్ల కుటుంబాలకు ఎటువంటి ఆటంకం లేకుండా ప్రతినెలా రేషన్ సరఫరా చేస్తున్నాం. గిడ్డంగుల నిర్మాణానికి సహకారం అందించాలని, పౌరసరఫరాల శాఖకు రావాల్సినటువంటి నిధులు మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాం’ అంటూ ఆయన వెల్లడించారు.
Also Read: నూతనంగా రెస్టారెంట్ ప్రారంభం.. కేవలం రూ. 2 లకే బిర్యానీ.. ఎక్కడంటే?
ఇదిలా ఉంటే.. ఉండవల్లిలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగ అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో మంత్రి లోకేశ్ సమీక్షించారు. పెట్టుబడిదారులను ఆకర్షించడం, మౌలిక సదుపాయాల కల్పనపై ఈ సందర్భంగా చర్చించారు. రియల్ టైం గవర్నెన్స్ ను మరింత మెరుగ్గా రూపుదిద్దాలంటూ అధికారులకు మంత్రి సూచించారు.
అనంతరం మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఐటీ అభివృద్ధి, పరిశ్రమల స్థాపన కోసం దేశంలోని టాప్ 10 పారిశ్రామిక వేత్తలతో చర్చించినట్లు ఆయన వెల్లడించారు. తిరుపతి, పరిసర ప్రాంతాల్లో ఎలక్ట్రానిక్ క్లస్టర్లను అభివృద్ధి చేయడంతోపాటు విడి భాగాలు తయారు చేసే యూనిట్స్ ను నెలకొల్పేందుకు కృషి చేయాలంటూ ఆయన పేర్కొన్నారు. ఇన్నోవేషన్ సెంటర్స్ లో ప్రోత్సహకాలు అందించి స్టార్టప్ లకు అవసరమైన అనుకూల వాతావరణాన్ని మరింతగా మెరుగుపరచాలన్నారు.