Ban on Wrestler Antim Panghal(Live sports news): భారత రెజ్లర్లకు పారిస్ ఒలింపిక్స్లో అంతగా కలిసి రావడంలేదు. అధిక బరువుతో ఇప్పటికే స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ ఫైనల్లో అనర్హత వేటును ఎదుర్కొన్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా భారత ఒలింపిక్ సంఘం (ఐవోఏ) కీలక నిర్ణయం తీసుకుంది. భారత యువ రెజ్లర్ అంతిమ్ పంఘాల్ పై నిషేధం విధించింది. మూడేళ్లపాటు నిషేధం విధిస్తున్నట్లు అందులో పేర్కొన్నది. ఒలింపిక్స్ లో క్రణశిక్షణా చర్యలను ఉల్లంఘించినందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐవోఏ స్పష్టం చేసింది. కాగా, పంగల్ ఒలింపిక్స్ నుంచి వైదొలిగే ప్రమాదం లేకపోలేదంటూ పలు మీడియా కథనాల్లో పేర్కొన్న విషయం తెలిసిందే.
కారణం ఆమె సోదరిని ఒలింపిక్ గేమ్స్ విలేజ్లోకి తన అక్రిడిటేషన్తో పంపించడమేనంటూ అందులో స్పష్టం చేస్తున్నారు. అంతిమ్ పంగల్ అక్రిడిటేషన్ను ఒలింపిక్స్ నిర్వాహకులు రద్దు చేశారు. ఆమెపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని అందులో వివరించారు.
అంతిమ్ పంగల్ ఫ్రీస్టైల్ 53 కేజీల కేటగిరీలో పోటీ పడింది. కాగా, క్వార్టర్స్లో తుర్కియే రెజ్లర్ యెట్ గిల్ చేతిలో పరాజయం పాలైంది. ఆ తరువాత ఆమె తన కోచ్లు వికాస్, భగత్ సింగ్ ఉంటున్న హోటల్కు వెళ్లింది. తన వస్తువులు కొన్ని క్రీడా గ్రామంలో ఉన్నట్లు సోదరి నిశాకు చెప్పి, తీసుకురమ్మంటూ కోరింది. అందుకోసం తన అక్రిడిటేషన్ కార్డును ఇచ్చింది. అయితే, నిశా క్రీడా గ్రామంలోకి వెళ్లి వస్తువులను తీసుకొని వస్తుండగా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. ఆమె నుంచి స్టేట్మెంట్ తీసుకున్నారు. అనంతరం అంతిమ్ను కూడా పిలిపించి వివరణ కూడా అడిగారు. ఆ తరువాత అంతిమ్ అక్రిడిటేషన్ దుర్వినియోగం అయినట్లు భావించిన ఒలింపిక్ నిర్వాహకులు.. రద్దు చేశారు. అదేవిధంగా పారిస్లో క్యాబ్ లో ప్రయాణించి డబ్బులు చెల్లించలేదంటూ అంతిమ్ వ్యక్తిగత సిబ్బందిపై కూడా అక్కడి పోలీసులకు ఆ క్యాబ్ డ్రైవర్ ఫిర్యాదు చేశాడు. అయితే.. దానిపై పోలీసులు ఎలాంటి కేసు నమోదు చేయలేదు.
Also Read: ఓడినంత మాత్రాన.. ప్రపంచం ఏమీ ఆగిపోదు: రోహిత్ శర్మ