నిజమే కదా.. ప్రభుత్వం తరపున ఇచ్చే పథకాలకు తన పేర్లు పెట్టుకోవడం ఏంటి? సరే పెడితే పెట్టారు. ఫోటోలు కూడా వేయించుకోవడం ఏంటి? పట్టాదారు పాస్ పుస్తకంపైనా జగన్ ఫోటోనే కనిపించేది. ఆఖరికి ఏదైనా శంకుస్థాపనో, ప్రారంభోత్సవమో చేస్తే.. ఆ శిలాఫలకంపై ఆయన ఫోటో ఉండాల్సిందే.. అది ఆయన నిర్ణయమో.. స్వామి భక్తితో వైసీపీ నేతలు చూపించిన పైత్యమో తెలియదు కానీ.. ఇది పీక్స్కు చేరింది. జగనన్న విద్యా దీవెన.. జగనన్న విదేశీ విద్యా దీవెన. జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రొత్సాహకం..
ఇలా పెట్టిన సంక్షేమ పథకాలన్నింటికి అంతా తానే అన్నట్టుగా జగన్ పేరు కనిపించేది. అయితే ఇకపై అలా కుదరదు అంటోంది కూటమి ప్రభుత్వం.
ఇప్పటికే చాలా పథకాల పేర్లు మార్చేసింది ఏపీ ప్రభుత్వం. దీంతో వైఎస్ జగన్, వైఎస్ఆర్ పేర్లు తొలగిపోతున్నాయి. ప్రభుత్వ పత్రాలు, ప్రభుత్వ భవనాలపై పార్టీ గుర్తులు, రంగులు, ఫోటోలు.. ఇలా ఏదీ ముద్రించవద్దని ఆదేశాలు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. అంతేకాదు రాజముద్ర తప్ప మరేది ఉండకూడదని నిర్ణయం తీసుకుంది. పాతవి తొలగించాలి.. కొత్తగా అలాంటివి జారీ చేయడం ఆపేయాలి. ఇది కూటమి ప్రభుత్వ ఆలోచన.. ఆచరణ.. జగన్ హయాంలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే..
హద్దు రాళ్లపై కూడా జగన్ బొమ్మను చిత్రీకరించారు.
Also Read: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ఏకంగా 28 మంది డీఎస్పీల బదిలీ
జగన్ ఫోటోను చిత్రీకరించడం కోసం గ్రానైట్ రాళ్లను కొన్నారు. దీని కోసం అక్షరాల 700 కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు చేశారు. పాసు పుస్తకాలపై జగన్ ఫోటోల ముద్రణ కోసం 15 కోట్లకు పైగా ఖర్చు పెట్టారు. మరి ఇంత ఖర్చు చేసి పనులు ఏమైనా సరిగా చేశారా? అంటే అదీ లేదు. నిజానికి వైసీపీ నేతలకు ప్రచార పిచ్చి పీక్స్లో ఉందనే చెప్పాలి. ఆ ప్రచార పిచ్చికి అధికారం తోడైంది.. అధికారం ఉంది కాబట్టి అధికారులు కూడా జీ హుజూర్ అన్నారు. ఓవరాల్గా చూస్తే జనం సొమ్మును రాళ్లపాలు చేశారు.. అప్పటి అమాత్యులు.
నిజానికి ప్రజాస్వామ్యంలో అధికారం అనేది ఓ నీటి బుడగలాంటిది. ఈ విషయాన్ని అస్సలు గమనించలేదు.. గుర్తించలేదు.. తెలుసుకోలేదు అప్పటి సీఎం వైఎస్ జగన్.. ఇప్పటి వరకు జరిగిపోయింది జరిగిపోయింది. కానీ ఇకపై అలా జరగదని కుండ బద్ధలు కొట్టి మరీ చెబుతుంది ఏపీ ప్రభుత్వం.. ఈ విషయంపై ఇప్పటికే కేబినెట్లో కూడా చర్చించింది. నిర్ణయం తీసుకుంది. ఆదేశాలు విడుదల చేసింది.
జగన్ బొమ్మతో ఉన్న పాస్ బుక్స్ను వెనక్కి తీసుకోనుంది.. సర్వే రాళ్లపై జగన్ బొమ్మ, పేరు ఇక కనుమరుగు కానుంది. అంతేకాదు ఏపీలో రీ సర్వేపై కూడా క్యాబినెట్లో రెవెన్యూశాఖ నోట్ సమర్పించింది. కాబట్టి.. ఇక జగన్ గుర్తులు, చిహ్నాలు ఏపీ ప్రభుత్వం నుంచి మాయం కానున్నాయి.