Mohammed Yunus: బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధానమంత్రిగా మహమ్మద్ యూనస్ బాధ్యతలు చేపట్ట నున్నారు. గురువారం రాత్రి ఎనిమిది గంటలకు ఆయన బాధ్యతలు తీసుకోనున్నారు. కేబినెట్లోకి వివిధ రంగాలకు చెందిన వ్యక్తులను యూనస్ పెద్దపీట వేయనున్నట్లు ఢాకా పత్రికలు చెబుతున్నాయి.
నోబెల్ అవార్డు గ్రహీత మహమ్మద్ యూనస్.. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధానిగా ఆయన బాధ్యతలు చేపట్ట నున్నారు. ప్రస్తుతం ఆయన ఫారెన్ టూర్లో ఉన్నారు. కొద్దిసేపటి కిందట దుబాయ్ నుంచి ఎమిరేట్స్ విమానంలో బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు చేరుకున్నారు. ఈ విషయాన్ని ఢాకా ట్రిబ్యూన్ వెల్లడించింది.
మహమ్మద్ యూనస్తోపాటు మరో 15 మంది మంత్రులుగా బాధ్యతలు చేపట్టనున్నారు. రాజకీయ పార్టీ లకు చెందినవారిని కాకుండా వివిధ రంగాలకు చెందినవారిని యూనస్ తన టీమ్లోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ALSO READ: ‘బంగ్లాదేశ్ అల్లర్లలో ఆర్మీ హస్తం’.. అంతర్జాతీయ మీడియా కథనం!
రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పోరాటం చేసి షేక్హసీనా ప్రభుత్వానికి కూలదోయడానికి కీలక పాత్ర వహించిన విద్యార్థి ఉద్యమ నేత నహిద్ ఇస్లాం కీలక పదవి అప్పగించనున్నారు. న్యాయ విభాగాల నుంచి కొందరు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడున్న పరిస్థితిని చక్కదిద్ది, వీలైనంత త్వరగా ఆ దేశంలో ఎన్నికలు జరిపించ డమే కాబోయే ప్రధాని యూనస్ ముందున్న ప్రధాన లక్ష్యం.
ఆందోళన సమయంలో బంగ్లాదేశ్కు జరిగిన నష్టం అంతాఇంతా కాదు. చివరకు పార్లమెంట్లోకి సైతం చొరబడి అక్కడి ఫర్నీచర్ను ధ్వంసం చేశారు ఆందోళనకారులు. చాలా ప్రాంతాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. ప్రస్తుతం అక్కడ సాధారణ పరిస్థితి రావడానికి చాలా సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు మరికొంత సమయం పడుతుందని అంటున్నారు.
బంగ్లాదేశ్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుండడంతో షేక్ హసీనా సమయంలో ఇబ్బందులు ఎదుర్కొన్న పారిశ్రామిక వేత్తలు ఊపిరి పీల్చుకుంటున్నారు. అందులో వస్త్ర పరిశ్రమ కీలకమైనది. ఆందోళన కారణం గా ఈ రంగానికి చాలానష్టం వాటిల్లింది. ఆ దేశం ఎగుమతుల్లో 90 శాతం వాటా ఈ సెక్టార్దే.
ప్రపంచవ్యాప్తంగా గార్మెంట్ ఎగుమతిలో గతేడాది మూడో స్థానంలో నిలిచింది బంగ్లాదేశ్. అక్కడి నుంచి యూరప్ దేశాలకు ఎక్కువగా ఎగుమతి అవుతాయి. కర్ఫ్యూ కారణంగా షాపులతోపాటు ఫ్యాక్టరీలకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నది అక్కడి బిజినెస్మేన్లమాట. మొత్తానికి మహమ్మద్ యూనస్ ఆధ్వర్యంలో ఏర్పడే తాత్కాలిక ప్రభుత్వానికి సమస్యలు చాలానే ఉన్నాయన్నమాట.