“Series lost doesn’t mean the end of the world”- Rohit Sharma: టీమ్ ఇండియా గెలిస్తే వార్త కాదు, ఓడిపోతేేనే వార్త అని అందరూ అంటుంటారు. ఎందుకంటే జట్టులో అతిరథ మహారథుల్లాంటి ఆటగాళ్లున్నారు. వారు అవుట్ అయిపోతే, వాటిపైనే చర్చ జరుగుతుంటుంది. అయితే శ్రీలంకతో వన్డే సిరీస్ ను కోల్పోయిన తర్వాత టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మమాట్లాడుతూ… ఇప్పుడు సిరీస్ ఓడిపోయినంత మాత్రాన ప్రపంచం ఏమీ ఆగిపోదు, ఈ రోజుతో అంతమైపోదని అన్నాడు. ఆటలో గెలుపు ఓటములు సహజమని అన్నాడు.
ఇకపోతే టీ 20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత భారత జట్టులోని ఆటగాళ్లు రిలాక్స్ అయ్యారని రిపోర్టర్లు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ అదంతా పెద్ద జోక్ అని కొట్టి పారేశాడు. అవన్నీ ఖాళీగా ఉండి చెప్పుకునే ఊసుపోని కబుర్లని చెప్పాడు.
ఇక్కడ భారత్ జట్టుకి ఆడేవాళ్లు గల్లీ క్రికెట్ ఆడటం లేదని, అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడుతున్నారని అన్నాడు. అలాంటప్పుడు రిలాక్స్ అన్నమాటకు అర్థమే లేదని అన్నాడు. అంతా కెరీర్ ప్రధానంగానే సాగుతుందని అన్నాడు. కావాలని ఎవరూ అవుట్ అయిపోరని, తమ కెరీర్ ని పణంగా పెట్టుకోరని అన్నాడు.
Also Read: శ్రీలంక ఆటగాళ్లూ.. మీకిది తగునా..
స్పిన్ ఆడటంలో భారత్ బ్యాటర్లు తడబడటంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపాడు. కానీ ఈ వైఫల్యాన్ని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నాడు. వ్యక్తిగత గేమ్ ప్లాన్స్పై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఒప్పుకున్నాడు. ఇళ్ల వద్ద కూడా ప్రాక్టీస్ చేయాల్సిందేనని అన్నాడు. అయితే ఈ సిరీస్లో ఒత్తిడికి గురైన మాట వాస్తవమేనని అన్నాడు. ఇకపోతే శ్రీలంక జట్టు బాగా ఆడిందని తెలిపాడు. వారికి ఆ క్రెడిట్ ఇవ్వాల్సిందేనని అన్నాడు.
ఓడినప్పుడు లోపాలే బయటకి వస్తాయి. అయితే మనకి కొన్ని సానుకూలాంశాలు కూడా ఉన్నాయని అన్నాడు. మన స్పిన్ బలం పెరిగిందని తెలిపాడు. ఇక మన మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు ఎన్నో ఏళ్లుగా నిలకడగా రాణిస్తున్నారు. ఒకట్రెండు మ్యాచ్ లు ఆడనంత మాత్రాన నిందించాల్సిన పని లేదని అన్నాడు. ఇప్పుడు తక్షణ కర్తవ్యం ఏమిటంటే, ముందు ఈ ఓటమి నుంచి బయటకు రావాలి… తర్వాత ఎలా పుంజుకోవాలనేది… ఆలోచించాలని అన్నాడు. జరిగిపోయిన దాన్ని వెనక్కి తీసుకురాలేం. అందుకని రేపటి గురించి ఆలోచించడం ఉత్తమం అని అన్నాడు.