Bangladesh Crisis updates(World news today): బంగ్లాదేశ్ అల్లర్లు హింసాత్మకంగా మారడంతో దేశంలో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. 15 ఏళ్ల పాటు సుదీర్ఘ పాలన అందించిన ప్రధాన మంత్రి షేక్ హసీనా చేత బంగ్లాదేశ్ సైన్యం బలవంతంగా రాజీనామా చేయించి.. దేశం నుంచి బయటకు పంపింది. ఇదంతా ఒక ఎత్తైతే.. ప్రభుత్వానికి, ఆర్మీకి మధ్య ముందు నుంచే విభేదాలున్నాయని అందుకే ఇదంతా జరిగిందని అంతర్జాతీయ మీడియా సంస్థ రాయ్ టర్స్ ఒక వార్తా కథనం ప్రచురించింది.
బంగ్లాదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగాల కోటా వివాదంతో మొదలైన నిరసనలు హింసాత్మకంగా మారడంతో.. నిరసనకారులను అడ్డుకోవాలని ప్రధాన మంత్రి షేక్ హసీనా జారీ చేసిన ఆదేశాలను ఆర్మీ పాటించలేదని.. రాయ్ టర్స్ రిపోర్ట్. షేక్ హసీనా దేశం విడిచి వెళ్లిపోయే ముందు చివరి 48 గంటల్లో ఏం జరిగిందని రాయ్ టర్స్ మీడియా ఒక విచారణ జరిపింది. ఇందులో భాగంగా నలుగురు సైన్యాధికారులతో మాట్లాడింది.
ఈ రిపోర్ట్ ప్రకారం.. నిరసనకారులు హింసకు పాల్పడుతుండడంతో వారిని బలపూర్వకంగా కట్టడి చేయాలని.. రాజధాని ఢాకాలో కర్ఫూ విధించాలని షేక్ హసీనా ఆదేశించారు. అయితే ఈ ఆదేశాలను చూసి ఆర్మీ చీఫ్ జెనెరల్ వాకర్ ఉజ్ జమాన్.. సైన్యాధికారులందరితో సమావేశమయ్యారు. నిరసనకారులపై బలప్రయోగం లేదా కాల్పులు జరపకూడదని ఆర్మీ చీఫ్ ఆ సమావేశంలో అందరినీ ఆదేశించారని ఇద్దరు సైన్యాధికారలు తెలిపారు. ఈ హింసాత్మక నిరసనల్లో పౌరుల ప్రాణాలు కాపాడేందుకే సైన్యం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ ఇద్దరు సైన్యాధికారులు వెల్లడించారు.
ఈ ఆదేశాల జారీ చేయడంతో జెనెరల్ వాకర్ ఉజ్ జమాన్.. షేక్ హసీనా ప్రభుత్వానికి ఇక సైన్యం మద్దతు లేదని స్పష్టం చేశారు. బంగ్లాదేశ్ అల్లర్లలో 469 మంది చనిపోయనట్లు అధికారిక సమాచారం. నిరసనకారులు అల్లరిమూకలుగా చెలరేగి ప్రధాన మంత్రి కార్యాలయం, ఆమె అధికారిక నివాసం, పలు ప్రభుత్వాధికారుల ఆస్తులు, హిందూ దేవాలయాలను ధ్వంసం చేశారు. నిజానికి ఆర్మీ చీఫ్ జెనెరల్ వాకర్ ఉజ్ జమాన్ షేక్ హసీనాతో కలిసి పనిచేశారు. ఆయన షేక్ హసీనా పిన్ని కూతురిని వివాహం చేసుకున్నారు. ఈ విధంగా హసీనా బంధువైనప్పటికీ జెనెరల్ వాకర్ ఉజ్ జమాన్.. ఆమెకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవడం ఆశ్చర్య పరిచిందని సైన్యాధికారులు చెప్పారు.
షేక్ హసీనా చేత బలవంతంగా రాజీనామా చేయించడం, ఆమెను దేశం విడిచి వెళ్లిపోయేందుకు 45 నిమిషాలు గడువు ఇవ్వడంతో పాటు.. ఆమె వెళ్లిన రోజు సాయంత్రమే హసీనా రాజకీయ శత్రువు, ప్రతిపక్ష నాయకురాలు ఖలీదా జియాను జైలు నుంచి విడుదల చేయించడం.. ఇదంతా నాటకీయంగా జరిగిన పరిణామాలు. కానీ కొంత కాలం క్రితమే ప్రధాన మంత్రి షేక్ హసీనా మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్ లో విభజన తీసుకొచ్చేందుకు ఒక తెల్ల జాతి దేశం ప్రయత్నిస్తోంది. ఆమె పరోక్షంగా అమెరికాపై ఆరోపణలు చేశారు. ఇప్పుడు బంగ్లాదేశ్ లో రాజకీయ సంక్షోభం చూస్తే.. ఆమె ఆరోపణలకు బలం చేకూరుతోంది. బంగ్లాదేశ్ లో ప్రభుత్వం కూల్చడానికి అమెరికా కుట్ర చేసిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
షేక్ హసీనా బంగ్లాదేశ్ నుంచి పారిపోయి భారత్ చేరుకున్నారు. అక్కడి నుంచి లండన్ వెళ్లానుకుంటున్న సమయంలో ఆమెకు బ్రిటన్ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. మరోవైపు అమెరికా కూడా ఆమె వీసా నిరాకరించింది. దీంతో ఆమె ప్రస్తుతం భారత్ లోనే తల దాచుకొని ఉన్నారు.
Also Read: బంగ్లా సంక్షోభం.. భారతపై ప్రభావమెంత?