Rocky Avenues Suma Issue(AP latest news): రాకీ అవెన్యూస్ సంస్థ బోర్డు తిప్పేసిన వివాదంలో యాంకర్ సుమ చిక్కుకున్నారు. యాంకర్ సుమ ప్రచారాన్ని నమ్మే తాము ఫ్లాట్లు కొనుగోలు చేశామని, ఇప్పుడేమో ఆ రియల్ ఎస్టేట్ సంస్థ బోర్డు తిప్పేసి చెక్కేసిందని వాపోయారు. పలువురు బాధితులు ఆమెకు నోటీసులు కూడా పంపించారు. రాకీ అవెన్యూస్ సంస్థ వివాదం, మోసంపై బిగ్ టీవీ ప్రత్యేక కథనాలు ప్రచురించింది. ఈ నేపథ్యంలో యాంకర్ సుమ రాకీ అవెన్యూస్ మోసం పై స్పందించారు.
రాకీ అవెన్యూస్ మోసాలతో తనకు సంబంధం లేదని యాంకర్ సుమ స్పష్టం చేశారు. ఆ సంస్థతో తన అగ్రిమెంట్ ఎప్పుడో ముగిసిందని వివరించారు. 2016 నుంచి 2018 మధ్య రాకీ అవెన్యూస్ సంస్థకు యాడ్స్ చేశామని తెలిపారు. 2018 తర్వాత ఆ యాడ్స్ను తన అనుమతి లేకుండా వాడారని చెప్పారు. రాకీ అవెన్యూస్ బాధితల నుంచి తనకు లీగల్ నోటీసులు అందాయని సుమ ధ్రువీకరించారు. ఆ నోటీసులకు తాను సమాధానం కూడా చెప్పానని వివరించారు. రాకీ అవెన్యూస్ యాజమాన్యానికి కూడా తాను లీగల్ నోటీస్ పంపానని, బాధితుల సమస్యను పరిష్కరించాలని కోరినట్టు వెల్లడించారు.
Also Read: BRS Party: బీజేపీలో విలీనం లేదు? కేటీఆర్ మాస్ వార్నింగ్ వెనుక అర్థమేంటీ?
ఏపీలో రాజమండ్రీలో రాకీ అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ.. ఈ మోసం చేసింది. మధ్య తరగతి ప్రజల సొంతింటి కలను నెరవేరుస్తామని నమ్మబలికింది. అపార్ట్మెంట్స్ కట్టి ఫ్లాట్స్ ఇస్తామని ప్రచారం చేసింది. యాంకర్ సుమ ద్వారా కూడా ప్రచారం చేయించారు. రాకీ అవెన్యూస్ ప్రచారం నిజమేనని నమ్మి పలువురు ఇందులో పెట్టుబడులు పెట్టారు. ఇలా మొత్తం రూ. 88 కోట్ల వరకు సేకరించిన తర్వాత రాకీ అవెన్యూస్ కంపెనీ బోర్డు తిప్పేసింది. యజమానులు కనిపించకుండా పరారయ్యారు. దీంతో బాధితులు రోడ్డెక్కారు. తమకు న్యాయం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే యాంకర్ సుమ మాటలు నమ్మి తాము పెట్టుబడులు పెట్టినట్టు పలువురు బాధితులు పేర్కొన్నారు. మరికొందరు ఆమెకు లీగల్ నోటీసులు పంపించారు.