Bhadrachalam Ramalayam surrounded by rain water: ఉమ్మడి జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురవడంతో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని పలు చోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. ముఖ్యంగా దమ్మపేట, భద్రాచలం, అన్నపురెడ్డి, ఖమ్మం, అశ్వరావుపేట, ములకలపల్లి, చింతకాని, బూర్గంపాడు, కూసుమంచిలో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. అలాగే టేకులపల్లి, ఆళ్లపల్లి పినపాక, మణుగూరు మండలాల్లోనూ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అయితే టేకులపల్లి మండలంలోని కోయగూడెం ఉపరితలగనిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది.
అదే విధంగా, భద్రాచలంలో తెల్లవారుజాము నుంచి కుండపోత వర్షం కురుస్తోంది. ఈ వర్షాలకు రామాలయం విస్తా కాంప్లెక్స్తో పాటు అన్నదాన సత్రం చుట్టూ వర్షపు నీరు చుట్టుముట్టింది. దీంతో భద్రాచలం రామాలయం పడమర మెట్ల వైపు రాకపోకలకు ఇబ్బందిగా మారింది. రామాలయం మెట్ల వద్ద భారీగా వరద చేరింది. రోడ్డుపై, రామాలయ పరిసర ప్రాంతాల్లో నడుము లోతు వరకు వరద నీరు చేరడంతో ఎటూ వెళ్లలేని పరిప్థితి ఏర్పడింది. అలాగే అన్నదాన సత్రంలోకి సైతం నీళ్లు చేరాయి. దీంతోపాటు రామాలయ పరిసర ప్రాంతాల్లో వాహనాలు సైతం మునిగిపోయాయి.
ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలకు భద్రాచలం రామాలయ ప్రాంతం తడిసి ముద్దయింది. అయితే గోదావరి నది కరకట్ట స్లూయిజ్ల నుంచి వర్షపు నీటిని పంపు చేయకపోవడంతోనే రామాలయ ప్రాంతం మరోసారి మునిగిందని స్థానికులు చెబుతున్నారు. మంత్రులు హెచ్చరించనప్పటికీ ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యంతోనే ఇలా జరిగిందని ఆరోపిస్తున్నారు.
Also Read: తెలంగాణాకు మరో భారీ పెట్టుబడి.. స్వచ్ఛ్ బయో.. రూ.1000 కోట్లతో
ఇదిలా ఉండగా, పాల్వంచ మండలంలోి కిన్నెరసాని ప్రాజెక్టకు వరద కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 407 అడుగులు ఉండగా..ప్రస్తుత నీటిమట్టం 404.10 అడుగులుగా ఉంది. ఇన్ ఫ్లో 4వేల క్యూసెక్కులు ఉంది. ఈ మేరకు 2 గేట్లు ఎత్తి 10వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. అలాగే పెనుబల్లి మండలంలోని లంకాసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 16 అడుగులు ఉండగా..ప్రస్తుత నీటిమట్టం 16.09 అడుగులకు చేరడంతో అలుగు పారుతోంది. ఇక, వేంసూరు మండలంలో అత్యధికంగా 66.8 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది.