Kidnap: రయ్ రయ్ అంటూ వరుసగా కార్లు వచ్చి ఆ ఇంటి ముందు ఆగాయి. వాహనాల్లోంచి పదుల సంఖ్యలో యువకులు దిగారు. అలా అలా సుమారు 100 మంది యువకులు ఆ ఇంటి మీదకు దాడికి వచ్చారు. కారు దిగిన వెంటనే.. కర్రలు, రాళ్లతో ఆ ఇంట్లోకి దూసుకెళ్లారు. ఫర్నీచర్ ధ్వంసం చేశారు. ఆ ఇంట్లో ఉండే యువతిని బయటకు తీసుకొచ్చి.. కారులో ఎత్తుకెళ్లిపోయారు.
యువతి కుటుంబ సభ్యులు ఆ యువకులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. రౌడీ ముకంతా కలిసి యువతి ఫ్యామిలీ మెంబర్స్ ను తీవ్రంగా కొట్టారు. ఆ టైమ్ లో డయల్ 100కి ఫోన్ చేసినా పోలీసులు స్పందించలేదని తెలుస్తోంది.
యువతిని కిడ్నాప్ చేసింది ఆ సమీపంలోని మిస్టర్ టీ స్టాల్ ఓనర్ నవీన్ రెడ్డి. వాళ్లిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవలే ఆమెకు వేరే యువకుడితో ఎంగేజ్మెంట్ అయినట్టు సమాచారం. వారిద్దరూ సన్నిహితంగా ఉన్న ఫోటోలు కూడా ఉన్నాయి.
నవీన్ రెడ్డి 100 మంది యువకులతో వచ్చి తమ కూతురిని ఎత్తుకెళ్లారంటూ బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరోవైపు, ఆగ్రహించిన యువతి కుటుంబ సభ్యులు నవీన్ రెడ్డికి చెందిన టీ స్టాల్ ను ధ్వంసం చేసి తగలబెట్టారు.
యువతి కిడ్నాప్ ఘటనతో రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పీఎస్ పరిధిలోని మన్నెగూడలో తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. గతంలో నవీన్రెడ్డిపై ఆదిభట్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు యువతి తండ్రి దామోదర్ రెడ్డి చెబుతున్నారు. అయినా, నవీన్రెడ్డి వేధింపులు ఆగలేదని.. పోలీసుల అండతోనే ఈ దాడికి తెగబడ్డారని ఆరోపించారు. పోలీసుల వైఖరిని నిరసిస్తూ.. సాగర్ హైవేపై ధర్నాకు దిగారు. ఇబ్రహీంపట్నం ఏసీపీ ఉమామహేశ్వరరావు ఘటనాస్థలికి చేరుకొని.. దర్యాప్తును పర్యవేక్షిస్తున్నారు. కిడ్నాపర్లను పట్టుకోవడం కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి యువతి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఆ యువతి ఇష్టపూర్వకంగానే నవీన్ రెడ్డితో వెళ్లిందా? లేదంటే, బలవంతంగా కిడ్నాప్ చేశారా? అనే కోణంలోనూ విచారణ సాగుతోంది.