Supreme Court: ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్లో రాజకీయ ఘర్షణలు కలకలం రేపాయి. కొన్ని చోట్ల జరిగిన ఈ హత్యలను ప్రధానం చేస్తూ అధికారాన్ని కోల్పోయి ప్రతిపక్షంలో చేరిన వైసీపీ ధర్నా కూడా చేసింది. అన్ని పార్టీలకు లేఖలు పంపి సంఘీభావాన్ని కోరింది. ఇందుకు ప్రతిపక్ష ఇండియా కూటమి పార్టీలు కూడా వైసీపీకి సంఘీభావాన్ని ప్రకటించాయి. తాజాగా వైఎస్ జగన్ మరోసారి రాజకీయ దాడుల గురించి మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రంలో రాజకీయ ప్రేరేపిత దాడులు ఆగడం లేదని, వైసీపీ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరుగుతున్నాయని వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ దాడులకు అడ్డుకట్ట వేయాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం లేదని, అందుకే ఈ దాడులు ఇంకా కొనసాగుతున్నాయని తెలిపారు. దాడులను అడ్డుకోవడానికి తాము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని చెప్పారు. అవసరమైతే హైకోర్టుకు వెళ్లుతామని, లేదా సుప్రీంకోర్టుకైనా వెళ్లడానికి సిద్ధమేనని వివరించారు.
విజయవాడ సన్రైజ్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వైసీపీ లీడర్ శ్రీనివాసరావును పరామర్శించిన అనంతరం, ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతున్నదని, వైసీపీ నేతలు, కార్యకర్తలపై టీడీపీ ఇష్టానుసారం దాడులు చేస్తున్నదని ఆరోపించారు. ఈ దాడులతో ఏం సాధిస్తారో తెలియడం లేదని, ఇలాంటి కిరాతక దాడులతో ప్రజలు భయపడరన్నారు. చంద్రబాబు పాలనపై కాకుండా తమ పార్టీ నేతుల, కార్యకర్తలపై దాడుల కోసం ఫోకస్ పెడుతున్నారని మండిపడ్డారు. ఇదంతా ప్రజల్లో చంద్రబాబుపై వ్యతిరేకతను రగులుస్తున్నదని, చాలా వేగంగా ఆయన గ్రాఫ్ పడిపోతున్నదని తెలిపారు. ఈ ప్రభుత్వం వేగంగా తుడిచిపెట్టుకుపోతుందని, తప్పుడు సాంప్రదాయాలను ఆపాలని, లేదంటే తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాగే టీడీపీ వారిని ట్రీట్ చేసేలా ఇప్పుడే బీజాలు వేస్తున్నారని వార్నింగ్ ఇచ్చారు.
Also Read: Gaddar Death Anniversary: నేను గీత తప్పలేదు బిడ్డా.. అని గర్వంగా చెప్పేవాడు: గద్దర్ తనయుడు సూర్యం
రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ గాడి తప్పిందని, ఇప్పటికీ రాష్ట్రంలో మహిళలు, చిన్నపిల్లలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని జగన్ అన్నారు. అందుకే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. దాడులు అడ్డుకోవడానికి అవసరమైతే హైకోర్టు, లేదా సుప్రీంకోర్టునైనా ఆశ్రయిస్తామని చెప్పారు. జడ్జీగా పని చేసిన ఏపీ గవర్నర్.. ఈ పరిణామాలన్నింటినీ చూసి వదిలేసే ధోరణితో తీసుకోవద్దని కోరారు. రాష్ట్రపతి పాలన విధించాలనే తమ డిమాండ్ను ఆలోచించాలని, రాష్ట్రపతి పాలన కోసం కలుగజేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
చంద్రబాబుపై ప్రజల్లో నమ్మకం పోయి వ్యతిరేకత మొదలైందని వైఎస్ జగన్ అన్నారు. ఎన్నికల్లో ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశారని ఆరోపించారు.