Bangladesh: బంగ్లాదేశ్లో అల్లర్లు కొనసాగుతున్నాయి. విద్యార్థి సంఘాల ఆందోళనలతో దేశం అట్టుడికిపోతోంది. తాజాగా జషోర్ జిల్లాలోని అవామీ లీగ్ ప్రధాన కార్యదర్శి షాహిన్ చక్లాదర్కు చెందిన జబీర్ ఇంటర్నేషనల్ హోటల్కు ఆందోళన కారులునిప్పంటించారు. ఈ ఘటనలో 24 మంది సజీవ దహనం అయ్యారు. అందులో ఒకరు ఇండోనేషియా పౌరుడు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
దీంతో బంగ్లాదేశ్లో మృతుల సంఖ్య భారీగా పెరిగింది. 21 రోజులుగా కొనసాగుతున్న ఆందోళనల కారణంగా వందలాది మంది మృతి చెందారు. ఇప్పటి వరకు మరణాల సంఖ్య 440 కి చేరింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు సైన్యం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. షేక్ హసీనా రాజీనామా చేసి దేశం విడిచి వెళ్లిన తర్వాత కొన్ని గంటల్లోనే 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇదిలా ఉంటే హోటల్కు నిప్పు పెట్టిన ఆందోళన కారులు అగ్నిమాపక సిబ్బంది రాకుండా కూడా అడ్డుకున్నారు.
Also Read: బంగ్లాదేశ్ పార్లమెంట్ రద్దు.. కొత్త ప్రభుత్వానికి మద్దతివ్వని విద్యార్థి ఉద్యమం
హింసాత్మక సంఘటనలు చోటు చేసుకుంటున్నా కూడా దేశంలో పరిస్థితి అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. హసీనాకు వ్యతిరేకంగా నిరసనల కారణంగా కొన్ని రోజులుగా మూసివేసిన పాఠశాలలను తిరిగి తెరిచినట్లు సమాచారం. దుకాణాలు, కార్యాలయాలు కూడా తెరుచుకున్నాయి. దీంతో పరిస్థితి కాస్త అదుపులోకి వచ్చినట్లు తెలుస్తోంది.