Revanth Reddy: నిజమే కొవొచ్చు. తెరవెనుక ఏదో జరుగుతున్నట్టే ఉంది. బీఆర్ఎస్ ఏర్పాటుకు ముందురోజే సజ్జల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రస్తావన తీసుకురావడం అనుమానాస్పదంగా ఉందంటున్నారు. ఇదే విషయంపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. ఇటు బీఆర్ఎస్, అటు కేసీఆర్ లపై ప్రశ్నల దాడి చేశారు.
టీఆర్ఎస్ పేరు మార్పుతో సీఎం కేసీఆర్కు తెలంగాణతో పేగు బంధం తెగిపోయిందన్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణ పేరుతో తెగదెంపులు చేసుకోవడం కేసీఆర్ ఖర్మ అన్నారు. బీజేపీ సూచనలతోనే ఈసీ టీఆర్ఎస్కు సహకరించిందన్నారు. బీఆర్ఎస్ విషయంలో కోర్టు ధిక్కరణకు పాల్పడ్డ సీఈసీపై లీగల్ ఫైట్ చేస్తామన్నారు. ఈ నెల 12న గులాబీ కూలీ వసూళ్ల కేసు ఢిల్లీ హైకోర్టులో విచారణకు వస్తోందని.. ఈ కేసు విచారణకు ముందే.. టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చారని ఆరోపించారు.
అవకాశం ఉంటే ఆంధ్ర, తెలంగాణను మళ్లీ కలపాలన్న ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల చేసిన వ్యాఖ్యలను సీఎం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఖండించలేదని.. సజ్జల వ్యాఖ్యలకు కేసీఆర్ సంపూర్ణ సహకారం ఉందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రాలను కలిపేస్తే రెండు ప్రాంతాల్లో పోటీ చేయొచ్చనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారేమో అనే అనుమానం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చడానికి ఆప్, ఎమ్ఐఎమ్ పార్టీల మాదిరే కేసీఆర్ బీజేపీకి సహకరిస్తారని ఆరోపించారు. కర్ణాటకలో స్పష్టమైన మెజార్టీతో గెలిచే కాంగ్రెస్ను.. బీఆర్ఎస్తో అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు.
ఇదంతా పక్కా ప్రణాళికతో జరిగిందని.. ప్రజలకు కేసీఆర్ చేస్తున్న ద్రోహమిదని పీసీసీ చీఫ్ మండిపడ్డారు. ఇది తెలంగాణ సమాజానికి బ్లాక్ డే అవుతుందన్నారు. మేధావులు, అమరుల కుటుంబాలు, తెలంగాణ సమాజం కేసీఆర్ వైఖరికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు రేవంత్ రెడ్డి.