Akunuri Murali: షాద్ నగర్ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. దళిత మహిళపై పోలీసులు రాత్రిపూట స్టేషన్కు తీసుకెళ్లి థర్డ్ డిగ్రీ ప్రయోగించిన ఘటన సర్వత్రా చర్చనీయాంశమైంది. పోలీసుల తీరుపై తీవ్ర అసంతృప్తి వెల్లువెత్తింది. సీఎం రేవంత్ రెడ్డి అమెరికాలో ఉన్నప్పటికీ ఈ ఘటనపై స్పందించి వెంటనే బాధిత అధికారిపై యాక్షన్ తీసుకోవాలని ఆదేశించారు.
ఈ ఘటనపై చాలా మంది స్పందించారు. కొంచెం ఆలస్యంగానైనా రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి షార్ప్గా రియాక్ట్ అయ్యారు. ‘ఇప్పుడు కూడా ఈ థర్డ్ డిగ్రీ చిత్రహింసలు ఏంటండి? బుద్ధి ఉందా?’ అని ఆకునూరి మురళి ఫైర్ అయ్యారు. వాస్తవానికి ఇలాంటి ఘటనలు చాలా జరుగుతాయని, బయటికి రానివి పది రెట్లు ఉంటాయని చెప్పారు.
బలహీనవర్గాలపై ఇలాంటి దాడులను దయచేసి ఆపండి అంటూ పోలీసులకు ఆకునూరి మురళి విజ్ఞప్తి చేశారు. ‘మీరు సెలవులు లేకుండా చాలా కష్టపడతారు. కానీ, ఇలాంటి దుర్మార్గాలతో డిపార్ట్మెంట్ అంతా బద్నాం అవుతుంది’ అంటూ పేర్కొన్నారు. ప్రభుత్వం ఇలాంటి పోలీసుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని, డిపార్ట్మెంట్ క్రమశిక్షణ చర్యలతోపాటు చట్టపర చర్యలు తీసుకుని నిందితులను జైలుకు పంపాలని కోరారు.
Also Read: నేను గీత తప్పలేదు బిడ్డా.. అని గర్వంగా చెప్పేవాడు: గద్దర్ తనయుడు సూర్యం
ఈ సందర్భంగా మరియమ్మ లాకప్ డెత్ కేసును ప్రస్తావించారు. మరియమ్మ లాకప్ డెత్లో కూడా చట్టపర చర్యలు తీసుకోకుండా నిందిత పోలీసులను వదిలిపెట్టారని పేర్కొన్నారు. ఇది అన్యాయం అని తెలిపారు.
ఇంకా ఎన్నాళ్లు ఈ థర్డ్ డిగ్రీల చిత్రహింసలు? దయచేసి తెలంగాణను థర్డ్ డిగ్రీ చిత్రహింసల నుంచి విముక్తి చేయండి అంటూ రాష్ట్ర డీజీపీ ట్యాగ్ చేసి కోరారు. పోలీసుల దాడులను నిలిపేయాలని పేర్కొంటూ రాష్ట్ర సీఎంవోను ట్యాగ్ చేశారు.